అల్లాదుర్గం (మెదక్): ప్రియుడు బెదిరించడంతో ప్రియురాలు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం అప్పాజీపల్లి గ్రామానికి చెందిన రోళ్ల రూప (21) హైదరాబాద్లో ప్రైవేట్ సంస్థలో విధులు నిర్వహిస్తోంది. అక్కడ ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడి ప్రేమించుకున్నారు. ఈ క్రమంలో రూపకు పెళ్లి చేసేందుకు తల్లిదండ్రులు టేక్మాల్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువకుడితో పది రోజుల కిందట నిశ్చితార్థం చేశారు.
ఈ విషయం తెలుసుకున్న పేమ్రించిన యువ కుడు, రూపకు ఫోన్ చేసి తనను కాదని మరొకరిని వివాహం చేసుకుంటే అంతు చూస్తానని బెదిరించినట్లు కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. దీంతో భయాందోళనకు గురైన రూప సోమవారం సాయంత్రం స్థానిక చెరువులో దూకింది. వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను చెరువులోంచి బయటకు తీశారు. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను జోగిపేట ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది.


