ప్రతిపాదనలు సిద్ధం చేయండి
పీఆర్ శాఖకు డిప్యూటీ సీఎం భట్టి సూచన
సాక్షి, హైదరాబాద్: వచ్చే మూడేళ్లలో రాష్ట్రంలో శాశ్వత భవ నాల్లేని గ్రామపంచాయతీల భవనాలు నిర్మించే దిశలో ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని పంచాయతీరాజ్ శాఖకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు సూచించారు. స్థలాలు అందుబాటులో ఉన్నచోట తహసీల్దార్, ఎంపీడీవో కార్యాలయాలు కలిపి నిర్మించే అవకాశాలు పరిశీలించాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారుల ఆరోగ్యంపై దృష్టి సారించాలని, అవసరమైన పౌష్టికాహారంతో పాటు బోధనా పద్ధతులతో తర్ఫీదు ఇవ్వాలన్నారు.
పట్టణాల్లో రోడ్లపై కొందరు చంటి బిడ్డలతో యాచక వృత్తి కొనసాగిస్తున్నారని, వారందరినీ శిశు విహార్లో చేర్చుకుని అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. రోడ్లపై చంటి బిడ్డలు పట్టపగలు ఎండకు, వర్షాకాలంలో వానకు తడిసి వారి విలువైన బాల్యం మసకబారకుండా చూడాలన్నారు. శిశు విహార్లలో ఆధునిక వంట గదిని నిర్మించాలని సూచించారు. మంగళవారం సచివాలయంలో 2026–27 బడ్జెట్ ప్రతిపాదనలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి సీతక్క ఆధ్వర్యంలో ప్రీ–బడ్జెట్ సమావేశం నిర్వహించారు.
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, మహిళలు, చిన్నారుల సంక్షేమానికి ఈ శాఖలకు బడ్జెట్లో ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిపారు. ఉపాధి హామీకి కేంద్ర ప్రభుత్వం కోతలు విధిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆ లోటును భర్తీ చేసే దిశగా చర్య లు తీసుకుంటుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు తగ్గకుండా ఉండేలా రాష్ట్రం నుంచి అవసరమైన నిధు లు కేటాయించి పథకం అమలు కొన సాగించేందుకు చర్యలు తీసుకుంటామని భట్టి విక్ర మార్క, సీతక్క వెల్లడించారు.
ఏజెన్సీలో ఇసుక మైనింగ్ ట్రైబల్ ఏజెన్సీల ద్వారా మాత్రమే జరగాలని భట్టి స్పష్టం చేశారు. సమావేశంలో ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, పంచాయతీరాజ్శాఖ స్పెషల్ సీఎస్ సంజయ్ కుమార్, మైనింగ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్, సీసీఎల్ఏ సెక్రటరీ లోకేశ్ కుమార్, మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనర్ అనితా రామచంద్రన్, పీఆర్ కమిషనర్ దివ్య దేవరాజ్, సమాచార శాఖ స్పెషల్ కమిషనర్ ప్రియాంక, గృహ నిర్మాణ శాఖ సెక్రటరీ గౌతం, డిప్యూటీ సీఎం స్పెషల్ సెక్రటరీ కృష్ణ భాస్కర్ పాల్గొన్నారు.


