హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా ఆపరేషన్ క్రాక్డౌన్ 1.0 పేరుతో సైబర్ సెక్యూరిటీ దాడులు జరుగుతున్నాయి. సైబర్ మోసాలకు సహకరిస్తున్న మ్యూల్ బ్యాంక్ ఖాతాల నెట్వర్క్లపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. 512 మంది సిబ్బందితో 137 పోలీసు బృందాలు ఏకకాలంలో దాడులు చేస్తున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా 137 బ్యాంక్ శాఖల్లో ఆకస్మిక తనిఖీలు చేశారు పోలీసులు. దేశ వ్యాప్తంగా 9,451 సైబర్ నేరాలకు లింక్ ఉన్న 1,888 ఖాతాలను గుర్తించారు. ఈ ఖాతాల ద్వారా సుమారు రూ.100 కోట్ల నష్టం జరిగినట్లు గుర్తించారు. ఈ ఆపరేషన్లో 549 ఎఫ్ఐఆర్లు నమోదుకాగా, 626 మంది అనుమానితులను పోలీసులు గుర్తించారు. అందులో 208 మంది అరెస్ట్ అయ్యారు.
అరెస్టయిన వారిలో 15 మహిళలు, ఏడుగురు విద్యార్థులు, ఇద్దరు లెక్చరర్లు, ఒక ప్రభుత్వ ఉద్యోగి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా ఉన్నారు. బ్యాంక్ ఖాతాలను అద్దెకు ఇచ్చి ప్రతి ట్రాన్సాక్షన్పై 5 శాతం కమిషన్ ఇస్తోంది సైబర్ క్రైమ్ ముఠా. 208 బ్యాంక్ పాస్బుక్లు, చెక్ బుక్లను పోలీసులు సీజ్ చేశారు. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, జూబ్లీహిల్స్ మర్చంట్ కో-ఆపరేటివ్ బ్యాంక్ ఉద్యోగులు అరెస్ట్ అయ్యారు. నిబంధనలకు విరుద్ధంగా ఖాతాలు తెరవడంలో సహకరించారు బ్యాంక్ అధికారులు.


