ఆరు గ్యారంటీల చట్టబద్ధతకు ప్రైవేట్‌ బిల్లు : కేటీఆర్‌ | BRS Leader KTR Comments On Congress Govt | Sakshi
Sakshi News home page

ఆరు గ్యారంటీల చట్టబద్ధతకు ప్రైవేట్‌ బిల్లు : కేటీఆర్‌

Mar 11 2026 3:46 AM | Updated on Mar 11 2026 3:46 AM

BRS Leader KTR Comments On Congress Govt

శాసనసభలో ప్రవేశపెట్టే ఈ బిల్లుకు అధికార పార్టీ మద్దతివ్వాలి: కేటీఆర్‌ 

ప్రభుత్వ పదవీకాలం సగం పూర్తయినా హామీల అమలు జరగట్లేదు

అసెంబ్లీ కమిటీలు లేకుండానే బలవంతపు సమావేశాలు 

ప్రభుత్వం చేస్తున్న అంకెల గారడీని బయట పెడతాం 

ముగిసిన బీఆర్‌ఎస్‌ శాసనసభాపక్ష ఓరియెంటేషన్‌ ప్రోగ్రామ్‌

సాక్షి, హైదరాబాద్‌: ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలకు మొదటి కేబినెట్‌ సమావేశంలోనే చట్టబద్ధత కల్పిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు కావొ స్తున్నా అమలు చేయడం లేదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మండిపడ్డారు. కాంగ్రెస్‌ వైఖరిని ఎండగట్టేందుకు సోమవారం నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్‌ఎస్‌ ప్రవేశపెట్టే ప్రైవేట్‌ మెంబరు బిల్లుకు అధికార పార్టీ మద్దతు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. హైదరాబాద్‌ నగర శివారులోని గోల్కొండ రిసార్టులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సంయుక్తంగా నిర్వహించిన అవగాహన కార్యక్రమం ముగిసిన అనంతరం కేటీఆర్‌ మీడియాతో మాట్లాడారు. ‘కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న మూడో వార్షిక బడ్జెట్‌కు అత్యంత ప్రాధాన్యం ఉంది. ప్రభుత్వ పదవీకాలం సగం పూర్తయినా హామీల అమలు జరగడం లేదు. 

ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ హామీల వైఫల్యం, మోసాన్ని ఎండగట్టేందుకు అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించాం. రెండేళ్లుగా అసెంబ్లీ కమిటీలు లేకుండానే ప్రభుత్వం సమావేశాలను బలవంతంగా నడిపిస్తోంది. పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీ చైర్మన్‌ పదవిని మా పార్టీకి ద్రోహం చేసి వెళ్లిన వ్యక్తికి ఇచ్చారు. సెలెక్ట్, స్టాండింగ్, పిటిషన్స్‌ తదితర 14 అసెంబ్లీ కమిటీలు పెండింగ్‌లో ఉన్నాయి. డిప్యూటీ స్పీకర్, చీఫ్‌విప్‌ లాంటి పదవులు భర్తీ చేయకుండా మందబలంలో బుల్డోజర్‌ టాక్టిక్స్‌ను ప్రభుత్వం ప్రయోగిస్తోంది. అసెంబ్లీ ఉభయ సభల్లో అబద్ధాలు, అసత్యాలతో అంకెలను తారుమారు చేస్తూ తూతూమంత్రంగా సమావే శాలు నిర్వహిస్తోంది’అని కేటీఆర్‌ మండిపడ్డారు. 

అసెంబ్లీలో కాంగ్రెస్‌ను నిలదీసేందుకే.. 
‘ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించి అసెంబ్లీలో నాటకాలు ఆడుతున్న కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని బలంగా నిలదీయడానికే అవగాహన సమావేశాలు బీఆర్‌ఎస్‌ ఏర్పాటు చేసింది. రైతుబంధు, ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో ఇళ్ల కూల్చివేత, మూసీ బాధితులు తదితర అంశాలతోపాటు ప్రజలకు ఇచ్చిన హామీలపై ప్రభుత్వాన్ని నిలదీస్తాం. అసెంబ్లీలో ప్రభుత్వం చేస్తున్న అంకెల గారడీని, లేని అప్పులను ఉన్నవిగా చూపిస్తున్న కాంగ్రెస్‌ అబద్ధాలను అంకెలతో సహా ఎండగడతాం. భవిష్యత్‌లోనూ బీఆర్‌ఎస్‌ శాసన మండలి, శాసనసభ సభ్యుల నడుమ మా పార్టీ సమన్వయం కోసం మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఆరు గ్యారంటీలు, హామీల అమలుకు నిధులు లేవని చెబుతున్న ప్రభుత్వం మూసీ ప్రక్షాళన పేరిట భారీ అవినీతికి తెరలేపింది. 

మేము సుందరీకరణకు కాకుండా దాని పేరిట జరుగుతున్న అవినీతిని వ్యతిరేకిస్తున్నాం. ఢిల్లీకి నిధులు పంపేందుకే రేవంత్‌రెడ్డి మూసీ ప్రక్షాళన ప్రాజెక్టును చేపడుతున్నాడు. రేవంత్‌రెడ్డి చెబుతున్న మాటలకు ఎంత మాత్రం విలువ లేదు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పట్టపగలు నాశనం చేసిన సీఎం ‘నైట్‌ ఎకానమీ’గురించి మాట్లాడుతున్నాడు. రేవంత్‌రెడ్డి పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారింది. రెండున్నరేళ్లలో కాంగ్రెస్‌ ఒక్క ఇళ్లు కట్టినా నేను రాజీనామా చేస్తాను అని చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నా. బీఆర్‌ఎస్‌ హయాంలో నిర్మించిన ఇళ్లు, ఫైఓవర్లు, ప్రాజెక్టులకు రంగులు పూసి రేవంత్‌ తమ ఘనతగా చెప్పుకుంటున్నాడు’అని కేటీఆర్‌ విమర్శించారు. 

ముగిసిన అవగాహన కార్యక్రమం 
అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఒక రోజు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కేటీఆర్‌ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌ బండా ప్రకాశ్, శాసనమండలిలో ప్రతిపక్ష నేత ఎస్‌.మధుసూదనాచారి తదితరులు ప్రసంగించారు. పార్టీ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్లు హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, పార్టీ ప్రధాన కార్యదర్శి రావుల చంద్రశేఖర్‌రెడ్డి వివిధ అంశాలపై ప్రసంగించారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement