రెవెన్యూ క్లినిక్లో అందని భూ చికిత్స
అనంతపురం అర్బన్: భూ సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న ‘రెవెన్యూ క్లినిన్’లో అర్జీలకు మొక్కుబడిగా పరిష్కారం లభిస్తోంది. ఈ విషయాన్ని అధికారిక నివేదిక స్పష్టం చేస్తోంది. అందిన అర్జీలు వందల్లో ఉంటే పరిష్కరించిన అర్జీలు పదుల సంఖ్యలో ఉండడం గమనార్హం. గత ఏడాది డిసెంబర్ 26న రెవెన్యూ క్లినిక్ ప్రారంభించారు. ప్రతి సోమవారం పరిష్కార వేదికతో పాటు రెవెన్యూ క్లినిక్ను కూడా నిర్వహిస్తున్నారు. భూ సమస్యలపై అప్పటి నుంచి అంటే దాదాపు రెండు నెలల వ్యవధిలో అందిన అర్జీల సంఖ్య 944 కాగా.. పరిష్కరించిన అర్జీలు 59గా నివేదికలో పేర్కొన్నారు.
95 శాతం మండలస్థాయివే..
రెవెన్యూ క్లినిక్లో అందుతున్న అర్జీల్లో 95 శాతం మండలస్థాయిలో పరిష్కారం కావాల్సినవే ఉంటున్నాయి. ఇప్పటి వరకు అందిన 944 అర్జీల్లో జిల్లాస్థాయిలో పరిష్కారం కావాల్సినవి 48 మాత్రమే (22ఏ) ఉన్నాయి. మిగిలిన అన్ని సమస్యలూ తహసీల్దారు స్థాయిలో పరిష్కరించాల్సినే కావడం గమనార్హం.
సత్వర పరిష్కారం ఎక్కడ..?
భూ సమస్యలపై అర్జీలను మండలస్థాయిలో స్వీకరించినా.. మండలస్థాయి యంత్రాంగం జిల్లా కేంద్రానికి వచ్చి ఇక్కడ తీసుకున్నా... పరిష్కారం కల్పించడంలో జరుగుతున్న జాప్యంలో ఎలాంటి మార్పూ లేదు. అర్జీలకు సత్వర పరిష్కారం కనిపించడం లేదు. ఇప్పటి వరకు అందిన వాటిలో 687 అర్జీల పరిషారానికి చర్యలు తీసుకున్నామంటూ (యాక్షన్ టు బీ టేకెన్) చూపిస్తున్నారు. అవి ఎప్పటికి పరిష్కరిస్తారనేది అధికారులకే తెలియాలి. మిగిలిన వాటిలో 12 జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ (డీఎల్ఎస్ఏ)కు పంపించారు. సచివాలయాలకు 89 పంపగా, ఆన్లైన్ రెవెన్యూ కోర్టు మేనేజ్మెంట్ కింద 49 రిజిస్టర్ చేశారు. సివిల్ వివాదాలకు సంబంధించి 48 సమస్యలు ఉన్నాయి.
మండలం, డివిజన్ను వదిలేసి..
ప్రజల నుంచి వారి సమస్యలపై అర్జీలు స్వీకరించేందు కోసం ప్రత్యేకంగా ప్రతి సోమవారం మండల, డివిజన్, జిల్లాస్థాయిలో పరిష్కార వేదిక నిర్వహిస్తున్నారు. అయితే రెవెన్యూ క్లినిక్ను ప్రారంభించిన తరువాత సోమవారం రోజున తహసీల్దార్లు మండలాన్ని.. ఆర్డీఓలు డివిజన్ను వదిలేసి సిబ్బందితో జిల్లా కేంద్రానికి వస్తున్నారు. దీంతో మండలస్థాయిలో అర్జీల స్వీకరణ బాధ్యతను డిప్యూటీ తహసీల్దారుకు అప్పగిస్తున్నారు. మండలంలో తహసీల్దారు లేకపోవడంతో అక్కడికి వెళ్లినా ప్రయోజనం లేదంటూ ప్రజలు వ్యయప్రయాసలకోర్చి తప్పనిసరై జిల్లా కేంద్రానికి వస్తున్నారు.
భూ సమస్యలపై వినతుల వెల్లువ
రెండు నెలల్లో అర్జీలు 944,
పరిష్కారం 59 మాత్రమే
ఐదు మండలాల నుంచే 370 అర్జీలు
రెవెన్యూ క్లినిక్లో అందని భూ చికిత్స
రెవెన్యూ క్లినిక్లో అందని భూ చికిత్స


