యువకుడి దుర్మరణం
కూడేరు: ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు.. వైఎస్సార్ కడప జిల్లా ఎ.కొండాపురం మండలం వెంకయ్యకాలువ గ్రామానికి చెందిన అరుణ్ (18), శివయ్య జేసీబీ వాహన డ్రైవర్, సహాయకుడిగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో కూడేరు మండలంలో జేసీబీతో చేపట్టిన పనుల్లో పాలు పంచుకుంటున్న వారు సోమవారం వాహనానికి అవసరమైన గ్రీజును అనంతపురంలో కొనుగోలు చేసి, ద్విచక్ర వాహనంపై తిరుగు ప్రయాణమయ్యారు. బ్రాహ్మణపల్లి సమీపంలోకి చేరుకోగానే 67వ జాతీయ రహదారిపై ఎదురుగా వేగంగా దూసుకొచ్చిన కారు ఢీకొంది. ఘటనలో అరుణ్ అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన శివయ్యను స్థానికులు వెంటనే అనంతపురంలోని సర్వజనాస్పత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. కాగా, ప్రమాదానికి కారణమైన డ్రైవర్ తన కారును అక్కడే వదిలేసి పారిపోయినట్లు సమాచారం.


