రెచ్చిపోతున్న మట్టి దొంగలు
కణేకల్లు: రాయదుర్గం నియోజకవర్గంలో మట్టి దొంగలు రెచ్చిపోతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు భూముల్లో విచ్చల విడిగా మట్టి తవ్వి అక్రమంగా తరలిస్తున్నారు. చివరకు తుంగభద్ర ఎగువ కాలువ (హెచ్చెల్సీ) గట్టుకు ఉన్న మట్టిని సైతం వదలడం లేదు. తాజాగా కణేకల్లు మండలం మాల్యం గ్రామశివారులో హెచ్చెల్సీ గట్టు మట్టిని కొందరు అక్రమంగా తరలిస్తున్నారు. పట్టపగలే జేసీబీ, ట్రాక్టర్లను పెట్టి కాలువ మట్టిని ఎడాపెడా తవ్వేస్తున్నా అధికారులు చోద్యం చూస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. సమీప భూమిలో పెద్ద గుంతను పూడ్చటానికి ఓ వ్యక్తి ఏకంగా హెచ్చెల్సీ గట్టు మట్టిపై కన్నేశాడు. గత రెండ్రోజుల నుంచి యథేచ్ఛగా మట్టి తవ్వి భూమిలోకి డంప్ చేస్తున్నాడు. నీటి ఉధృతి పెరిగినప్పుడు హెచ్చెల్సీకి గండిపడితే దాన్ని పూడ్చేందుకు మట్టి అవసరమవుతుంది. ఆ సమయంలో మట్టి అందుబాటులో లేకపోతే సుదూర ప్రాంతం నుంచి మట్టిని తరలించాల్సి వస్తోంది. గట్టు దెబ్బతింటే నీరంతా వృథా అయ్యి తీరని నష్టం వాటిల్లుతుందని ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. గట్టు బలహీనపడకుండా అధికారులు పరిరక్షణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
హెచ్చెల్సీ గట్టు మట్టినీ వదలని వైనం
రెచ్చిపోతున్న మట్టి దొంగలు


