ఎస్టీల సమస్యలపై నిర్లక్ష్యం వద్దు
● గిరిజనులకు విరివిగా
రుణాలు అందించాలి
● జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోతు హుస్సేన్
అనంతపురం ఎడ్యుకేషన్: ఎస్టీల సమస్యలపై నిర్లక్ష్యం ప్రదర్శించొద్దని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోతు హుస్సేన్ ఆదేశించారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, గిరిజన నాయకులతో కలెక్టర్ ఓ.ఆనంద్, ఎస్పీ పి.జగదీష్, రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యుడు పి. వెంకటప్పతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోతు హుస్సేన్ మాట్లాడుతూ జిల్లాలో ఎస్టీ కమిషన్కు కొన్ని ఫిర్యాదులు వచ్చాయని, వాటిని కచ్చితంగా పరిష్కరించాలన్నారు. ఎస్టీ, ఎస్సీ కాలనీల్లో విద్యుత్ సౌకర్యాలు పూర్తి స్థాయిలో నాణ్యతగా కల్పించాలన్నారు. తండాల్లో రోడ్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఆత్మకూరు మండలం మదిగుబ్బలో సుమారు 2 వేల మంది ప్రజలు ఉన్నారని, ఇప్పటిదాకా సరైన రోడ్డు సదుపాయం లేకపోవడం బాధాకరమన్నారు. వెంటనే రోడ్డు వేయాలని ఆదేశించారు. సేవాలాల్ జయంతికి రూ. 50 లక్షల నిధులు విడుదల చేశారని, మరిన్ని నిధులు విడుదల చేయాలన్నారు. మదిగుబ్బ గ్రామంలో ఫ్లోరైడ్ వాటర్ ఉందని, తండాకు పైప్ లైన్ ఏర్పాటు చేయలేదన్నారు. ఎస్టీలకు విరివిగా బ్యాంకు రుణాలు అందించాలన్నారు. జాతీయ ఎస్టీ కమిషన్ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసిందన్నారు.కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకమైన పీఎం కుసుమ్ అమలు మొదలైందన్నారు. ఎస్టీలకు పూర్తి స్థాయిలో పథకాల లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకుంటామన్నారు. గిరిజన నాయకులు మాట్లాడుతూ సేవాగడ్ను టూరిజం హబ్గా అభివృద్ధి చేయాలన్నారు. సమావేశంలో డీఆర్ఓ ఏ.మలోల, ఆర్డీఓ కేశవనాయుడు, డీటీడబ్ల్యూఓ శ్రీనివాసరావు, సీపీఓ అశోక్ కుమార్, జెడ్పీ సీఈఓ శివశంకర్ తదితరులు పాల్గొన్నారు.
గిరిజనులకు అండగా అంటాం
రాప్తాడు రూరల్/ఆత్మకూరు: గిరిజనులకు అండగా ఉంటామని, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోతు హుస్సేన్ అన్నారు. శనివారం ఆయన కురుగుంట సేవాలాల్ కాలనీతో పాటు ఆత్మకూరు మండలంలోని మదిగుబ్బ తండాలో పర్యటించారు. గిరిజనులతో సమావేశం నిర్వహించారు. స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. జిల్లా అధికారులతో మాట్లాడి వెంటనే పరిష్కారమయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఎస్టీలు తమ సమస్యలను ncstgrams.gov.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో ఫిర్యాదు చేయవచ్చన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ నరసింహ, తహసీల్దార్లు మోహన్ కుమార్, లక్ష్మినాయక్, ఎంపీడీఓలు లక్ష్మినరసింహ, దివాకర్, ఏఐబీఎస్ఎస్ ఏపీ స్టేట్ ప్రెసిడెంట్ బాన్నోత్ చక్రి నాయక్ తదితరులు పాల్గొన్నారు.


