‘ఆడబిడ్డ నిధి’ ఊసే లేదు
అధికారంలోకి వస్తే 18 ఏళ్లు పైబడిన మహిళలందరికీ ‘ఆడబిడ్డ నిధి పథకం కింద ప్రతి నెలా రూ.1,500 ఇస్తామని ఎన్నికల సమయంలో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు హామీనిచ్చారు. అధికారం చేపట్టి రెండేళ్లు గడుస్తోంది. ఇప్పటి వరకూ ఆడబిడ్డ నిధి ఊసే లేదు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను సీఎం చంద్రబాబు నెరవేర్చాలి. గడిచిన 20 నెలలకు సంబంధించి రూ.30 వేల బకాయిలను వెంటనే చెల్లించాలి.
– బోయ శివమ్మ, గృహిణి, ఉదిరిపికొండ,
కూడేరు మండలం
పేదలకు అన్యాయం
చంద్రబాబు ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో పేదలకు తీరని అన్యాయమే జరిగింది. రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేశారు. ముఖ్యంగా 20 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలంటూ నిరుద్యోగులను నట్టేట ముంచారు. నిరుద్యోగ భృతి హామీని మర్చిపోయారు. 50 ఏళ్లకే పింఛన్ ఊసేలేకుండా పోయింది. ఇప్పటికీ వితంతువులకు పింఛన్లు ఇవ్వకుండా వేధిస్తూనే ఉన్నారు. రూ.1,500 చొప్పున ఆడబిడ్డ నిధి పేరుతో అక్క, చెల్లెమ్మలను మోసం చేశారు. మహిళా సంఘాల సభ్యులకు సున్నా వడ్డీ కింద రుణాలపై స్పష్టత లేదు. రైతాంగం కోసం అరకొర నిధులు కేటాయించారు. విద్య, వైద్య రంగాలకు నిధులు కేటాయించకుండా పీపీపీ విధానాన్ని ప్రవేశ పెట్టి పేదల భవిష్యత్తుకు గండికొట్టారు. ఉద్యోగులకు చెల్లించాల్సిన రూ.40 వేల కోట్ల బకాయిలపై ఎలాంటి ప్రకటన లేదు. ఇది మోసపూరిత బడ్జెట్.
– డాక్టర్ తలారి రంగయ్య, వైఎస్సార్సీపీ సమన్వయకర్త, కళ్యాణదుర్గం


