● జరుట్ల రామలింగేశ్వరా పాహిమాం
వజ్రకరూరు: మండలంలోని జరుట్ల రాంపురంలో వెలసిన రామలింగేశ్వరస్వామి రథోత్సవం సోమవారం సాయంత్రం వైభవంగా సాగింది. ఉదయం ఆలయంలో మూలవిరాట్కు విశేష అభిషేకాలు పెద్ద ఎత్తున జరిగాయి. మధ్యాహ్నం మడుగు తేరును లాగారు. సాయంత్రం ఆలయం నుంచి పార్వతీ పరమేశ్వరుల ఉత్సవ మూర్తులను మేళతాళాలతో ఊరేగింపుగా తీసుకెళ్లి రథంపై అధిష్టింపజేశారు. ప్రత్యేక పూజల అనంతరం హర నామ స్మరణతో రథాన్ని బసవన్న దే వాలయం వరకు లాగి తిరిగి యథాస్థానానికి చేర్చారు. వేలాదిగా భక్తులు తరలి రావడంతో ఆలయ పరిసరాలు జనసంద్రమయ్యాయి. మంగళవారం వసంతోత్సవంతో ఉత్సవాలను ముగుస్తున్నట్లు ఆలయ ఈఓ అంగదాల కృష్ణయ్య తెలిపారు.


