ప్రాణం బలిగొన్న ఈత సరదా
● స్విమ్మింగ్ పూల్లో ఈత కొడుతూ మెడికో మృతి
● మృతుడు మార్కాపురం నివాసి
గార్లదిన్నె: ఈత సరదా ఓ మెడికో ప్రాణాన్ని బలిగొంది. పోలీసులు తెలిపిన మేరకు... ఉమ్మడి ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణానికి చెందిన సుబ్రహ్మణ్యం కుమారుడు మోహన్ (18) గత ఏడాది సెప్టెంబర్లో అనంతపురం మెడికల్ కళాశాలలో మొదటి సంవత్సరంలో చేరాడు. మంగళవారం ఉదయం 9 మంది సహచర విద్యార్థులతో కలిసి ట్రిప్ పేరుతో ఆటోలో గార్లదిన్నెకు వచ్చాడు. అనంతరం స్నేహితులందరూ కలసి రైల్వేగేట్ సమీపంలోని స్విమ్మింగ్ పూల్లో ఈత కొట్టేందుకు చేరుకున్నారు. కేవలం 9 అడుగుల లోతు ఉన్న స్విమ్మింగ్ పూల్లో ఆరు అడుగులు మాత్రమే నీరున్నాయి. ఈ విషయం తెలుసుకోకుండా మోహన్ పై నుంచి తలకిందులుగా డైవ్ చేశాడు. దీంతో పూల్ అడుగు భాగానికి తల ఢీకొని అపస్మారక స్థితికి చేరుకున్నాడు. ఎంత సేపటికీ మోహన్ పైకి రాకపోవడంతో గట్టుపై ఉన్న స్నేహితులు వెంటనే స్విమ్మింగ్ పూల్లో దూకి గాలించి మోహన్ను వెలికి తీశారు. వెంటనే సీపీఆర్ చేశారు. ఫలితం దక్కకపోవడంతో హుటాహుటిన ఆటోలో గార్లదిన్నెలోని పీహెచ్సీకి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మోహన్ మృతి చెందినట్లు నిర్ధారించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని అనంతపురంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారను. ఘటనపై గార్లదిన్నె పీఎస్ ఎస్ఐ గౌస్ మహమ్మద్ బాషా కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.


