హరహర మహాదేవ
లేపాక్షి: ఓం నమః శివాయ, హరహర మహాదేవ అంటూ భక్తులంతా ఆ ముక్కంటిని కీర్తించగా పంచాక్షరీ నామంతో లేపాక్షి ప్రతిధ్వనించింది. మహాశివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని సోమవారం శివపార్వతుల బ్రహ్మ రథోత్సవం వైభవంగా సాగింది. మధ్యాహ్నం ప్రత్యేక పూజల తర్వాత నాట్యమంటపంలో స్వామి వారికి మహామంగళ హారతి ఇచ్చి శివపార్వతుల ఉత్సవ విగ్రహాలను వేదపండితులు ఊరేగింపుగా బస్టాండు వద్దకు తీసుకువచ్చి రథంలో కొలువుదీర్చారు. హరహర మహాదేవ అంటూ భక్తులు కీర్తించగా కదిలిన కై లాసవాసుని రథం ఎగువ పేటలోని రామభజన మందిరం వరకు సాగింది. రథం ముందు భాగంలో మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, హైదరాబాద్ నుంచి వచ్చిన వెంకట అన్నమాచార్య బృందం కోలాటాలను ప్రదర్శించారు. రథం రామ భజన మందిరం వద్దకు చేరుకోగానే ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం ధూళోత్సవం తర్వాత రథాన్ని యథాస్థానంలోకి తీసుకు వచ్చారు. ఆలయ కమిటీ చైర్మన్ కరణం రమానందన్, ఈఓ నరసింహమూర్తి పర్యవేక్షణలో సునీల్శర్మ ఆధ్వర్యంలో వేదపండితులు పూజ కార్యక్రమాలను నిర్వహించారు.


