అహూడా.. ఏదీ అభివృద్ది జాడా?
అనంతపురం క్రైం: అనంతపురం–హిందూపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (అహుడా)లో అభివృద్ధి జాడ కనిపించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అథారిటీ కార్యాలయం ఎవరికి ఉపయోగపడుతుందో తెలియడం లేదని పలువురు అంటున్నారు. కేవలం ప్రచార కార్యాలయంగా మార్చారంటూ పెదవి విరుస్తున్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ‘అహుడా’ ఒక వెలుగు వెలిగింది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఏకంగా రూ.6.53 కోట్ల నిధులతో మొత్తం 22 పనులు చేపట్టారు. రోడ్లు, సెంట్రల్ లైటింగ్, పార్కులు, జిమ్ పరికరాలు, లేఅవుట్ల అభివృద్ధి, ప్రహరీల నిర్మాణాలను ప్రణాళికాబద్ధంగా చేశారు. అనంతపురంలోని ఆర్డీఓ కార్యాలయం నుంచి జేఎన్టీయూ దాకా సుందరంగా రహదారి నిర్మించడంతో పాటు ధర్మవరంలో రహదారులు, గుత్తి లేఅవుట్ అభివృద్ధి, పట్టణ ప్రాంతాలో పార్కులు, జర్నలిస్ట్ కాలనీల్లో పార్కు అభివృద్ధిలో భాగంగా ప్రహరీ ఏర్పాటు చేశారు.
ఫొటోలకు ఫోజులతో సరి..
అనంతపురం నగరంలోని అహుడా కార్యాలయంలో ప్రతి గురువారం నిర్వహించే ‘గ్రీవెన్స్’ కార్యక్రమం ఫొటోలకు ఫోజులివ్వడానికి మినహా మరెందుకూ ఉపయోగపడడం లేదని ఆ కార్యాలయ సిబ్బందే విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ వారం నిర్వహించిన గ్రీవెన్స్లో ఉన్నతాధికారులు, పాలకవర్గం సభ్యులు కనిపించకపోవడం గమనార్హం. ఈ క్రమంలో కేవలం రెండు అర్జీలే వచ్చాయి. చాలామంది అర్జీదారులు ఖాళీ కుర్చీలను చూసి నిరాశతో వెనుదిరగడం కనిపించింది. గతంలో వచ్చిన అర్జీలకు కూడా పరిష్కారం చూపిన దాఖలాలు లేవు. 19 నెలల చంద్రబాబు పాలనలో ఒక్క అభివృద్ధి పని కూడా చేపట్టలేదంటే ‘అహుడా’ దుస్థితిని అర్థం చేసుకోవచ్చు. అహుడా చైర్మన్ టీసీ వరుణ్ వైఎస్సార్ సీపీ హయాంలో వేసిన ఎంఐజీ లేఅవుట్లలో హంగామా తప్పా పైసా కూడా తీసుకురాలేదన్న విమర్శలున్నాయి.
ఆదాయం.. దూరం
జిల్లాలో ఎక్కడ చూసినా వందల ఎకరాల్లో అక్రమ లేఅవుట్లు దర్శనమిస్తున్నాయి. మారుమూల ప్రాంతాలు కాదు.. నగరానికి రెండు, మూడు కిలోమీటర్ల దూరంలోనే ఇష్టారాజ్యంగా లేఅవుట్లు వేశారు. వీటిపై కూడా చర్యలు తీసుకోవడంలేదు. ప్రభుత్వం తీసుకువచ్చిన క్రమబద్ధీకరణ పథకం కూడా సా...గుతోంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులతో కలసి ఒక్క సమీక్ష నిర్వహించలేదు. లేఅవుట్లను క్రమబద్ధీకరించుకునేందుకు ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలన్న సూచనలు కూడా ప్రజల్లోకి వెళ్లలేదు. దీంతో చాలా మందికి క్రమబద్ధీకరణ విషయంలో స్పష్టత లేకుండా పోతోంది. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం కూడా గణనీయంగా తగ్గిపోయింది.
చంద్రబాబు ప్రభుత్వంలో ఒక్క పని జరిగితే ఒట్టు
వినతులనూ పట్టించుకోని అధికారులు
గ్రీవెన్స్లో ఫొటో షూట్లకే
పరిమితమవుతున్నారన్న విమర్శలు
వైఎస్సార్ సీపీ హయాంలో
రూ. 6.53 కోట్లతో అభివృద్ధి పనులు


