అనంతపురం కక్కలపల్లి మండీలో గురువారం కిలో టమాట గరిష్ట ధర రూ.9 పలికింది. కనిష్టం రూ.4, సరాసరి రూ.6 ప్రకారం క్రయ విక్రయాలు జరిగాయి.
చీనీ టన్ను రూ.23 వేలు
అనంతపురం మార్కెట్యార్డులో గురువారం చీనీకాయలు టన్ను గరిష్ట ధర రూ.23 వేలు పలికాయి.
ఆర్డీటీ కోసం ర్యాలీ చేస్తే అక్రమ కేసులా?
● తలారి రంగయ్యతో పాటు మరో 32 మందిపై కేసు నమోదు
● అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో పోలీసుల అత్యుత్సాహం
కళ్యాణదుర్గం: కళ్యాణదుర్గంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. వైఎస్సార్ సీపీ నేతలపై అక్రమ కేసులు నమోదు చేశారు. ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ చేయించడంలో కీలక పాత్ర పోషించిన వైఎస్సార్సీపీ సమన్వయకర్త తలారి రంగయ్యను పార్టీ నేతలు, నియోజకవర్గ ప్రజలు సన్మానించేందుకు గత నెల 30న దుర్గంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. దీన్ని టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోయారు. ర్యాలీ సందర్భంగా విధుల్లో ఉన్న గంగాధరప్ప అనే కానిస్టేబుల్ విధులకు ఆటంకం కలిగించారని, మహిళలను కించపరిచేలా వ్యవహరించారని, ప్రజలకు ఇబ్బంది కలిగించారనే సాకులు చూపుతూ అతనితో కళ్యాణదుర్గం అర్బన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయించారు. ఫిర్యాదు మేరకు రంగయ్యతో పాటు పార్టీ రాష్ట్ర కార్యదర్శి బోయ తిప్పేస్వామి, జడ్పీటీసీ గుద్దెళ్ల నాగరాజు, కౌన్సిలర్లు లక్ష్మన్న, తిరుమల వెంకటేశులు, గోపారం శ్రీనివాసులు, పార్టీ కన్వీనర్లు ఐ. సుధీర్, గోళ్ల సూరి, ఎంఎస్ రాయుడు, పాలబండ్ల చంద్రశేఖర్ రెడ్డి, ఎంపీపీలు కంభం చంద్రశేఖర్రెడ్డి, భీమేష్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి దొడగట్ట నారాయణ, సీనియర్ నాయకులు వన్నూర్రెడ్డి, అభిలాష్ రెడ్డి, హనుమంతరెడ్డి, రామచంద్ర, దొడ్లో తిప్పేస్వామి, తలారి రాజ్కుమార్, గొర్ల గంగాధర్, షేక్షావలి, ఎరుకుల రామాంజినేయులు, దొడగట్ట మురళి, ఎరుకుల రమేష్, గూబనపల్లి నాగరాజు, మంజునాథ్, శ్రీనివాసులు, బాపూజీ, రామాంజినేయులు, టైలర్ శీనా, జానీపై కేసులు నమోదు చేశారు.
రాజకీయ ఒత్తిళ్లతోనే...
తలారి రంగయ్యను సన్మానించి, విజయోత్సవ ర్యాలీ చేయడం అధికార టీడీపీ నేతలకు మింగుడపడలేదు. పోలీసులపై ఒత్తిళ్లు తెచ్చి కేసులకు తెర తీశారు. శాంతియుతంగా ర్యాలీ చేస్తున్న వారిపై అక్రమ కేసులు బనాయించడంపై ప్రజలు విస్మయం చెందుతున్నారు. ఆర్డీటీ కోసం చేసిన ర్యాలీని కూడా రాజకీయం చేసి అక్రమ కేసులు పెట్టడం ఏమిటని నిలదీస్తున్నారు.


