● జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ
అనంతపురం టవర్క్లాక్: బాధ్యతతో విధులు నిర్వర్తించినప్పుడే సమాజంలో మంచి గుర్తింపు ఉంటుందని నూతనంగా ఉద్యోగాల్లో చేరుతున్న వారికి జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ సూచించారు. కారుణ్య నియమాకం కింద ఉద్యోగం పొందిన ఉమ్మడి జిల్లాకు చెందిన 13 మందికి గురువారం తన చాంబర్లో నియామక ఉత్తర్వులను ఆమె అందజేసి, అభినందించారు. విధుల పట్ల అంకిత భావంతో ఉండాలన్నారు. చదివిన చదువులకు ఇది చాలా చిన్న ఉద్యోగమే అయినా మరింత పట్టుదలతో పోటీ పరీక్షకు సన్నద్ధమై ఉన్నత ఉద్యోగాలు సాధించాలన్నారు. అనంతరం వారికి పోస్టింగ్లు కల్పిస్తూ ఉత్తర్వులు అందజేశారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఈఓ వెంకటసుబ్బయ్య, ఏఓ శ్రీనివాసులు పాల్గొన్నారు.
వక్కలకుంటలో చేపల మృతి
గుత్తి: స్థానిక మన్రో సత్రం సమీపంలో ఉన్న వక్కలకుంటలో గురువారం వేలాదిగా చేపలు మృత్యువాత పడ్డాయి. మృతి చెంది ఒడ్డుకు చేరిన చేపలను స్థానికులు గమనించి సమాచారం ఇవ్వడంతో మత్స్యకారులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. విష ప్రయోగం వల్ల జరిగిందా? లేక వైరస్ వల్ల జరిగిందో తెలియడం లేదు. ఘటనపై మత్స్యకారులు విచారణ చేపట్టారు.
పాలిసెట్ ఉచిత శిక్షణ
అనంతపురం: ఏపీ పాలిసెట్ –2026కు సన్నద్ధమవుతున్న విద్యార్థులకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఉచిత శిక్షణను అందిస్తున్నారు. ఈ నెల 4 నుంచి 22వ తేదీ వరకు ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు శిక్షణా తరగతులు ఉంటాయి. అనంతపురంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో శిక్షణ తీసుకోవాలనే ఆసక్తి ఉన్న వారు 89857 03601 కు కాల్ చేసి సంప్రదించాలని ఆ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సి.జయచంద్రారెడ్డి తెలిపారు. అలాగే తాడిపత్రి పాలిటెక్నిక్ కళాశాల (79016 20198), గుంతకల్లు (70759 32669), కళ్యాణదుర్గం (95055 04207) నంబర్లలో సంప్రదించవచ్చునని పేర్కొన్నారు.


