గుంతకల్లు: గుంతకల్లు రైల్వే డివిజన్ ప్రగతి పథంలో దూసుకెళ్తోంది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో అన్నింటా ఉత్తమ ఫలితాలు సాధించింది. సరకు రవాణా, ప్రయాణికుల చేరవేత, రైలు ప్రమాదాల నివారణలో మెరుగైన ప్రదర్శన కనబరచి ఆదర్శంగా నిలిచింది. దక్షిణ మధ్య రైల్వే జోనల్లోనే ప్రత్యేక గుర్తింపు సాధించింది.
విశేష వృద్ధి ..
గత ఆర్థిక సంవత్సరంలో సరకు రవాణా, ప్రయాణికుల చేరవేత ద్వారా రికార్డు స్థాయిలో రూ.2,249 కోట్లకు పైగా గుంతకల్లు రైల్వే డివిజన్కు ఆదాయం సమకూరింది. గూడ్స్ రైళ్లలో ఇనుప ఖనిజం, బైరెటీస్, సున్నపురాయి, బొగ్గు తదితర వాటి తరలింపులో 2024–25 ఆర్థిక సంవత్సరం కంటే 13.5 శాతం వృద్ధి సాధించింది. 15.73 మిలియన్ల టన్నుల సరుకు రవాణా ద్వారా రూ.1,134 కోట్లు ఆర్జించింది.
ప్రయాణికుల చేరవేతలో..
గుంతకల్లు రైల్వే డివిజన్ వివిధ మార్గాల్లో 1,450 కి.మీలకు పైగా విస్తరించింది. తిరుపతి, మంత్రాలయం, కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి, ఒంటిమిట్ట తదితర ప్రముఖ పుణ్యక్షేత్రాలు డివిజన్ పరిధిలో ఉండడంతో రైళ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతుంటాయి. ఈ క్రమంలో ప్రయాణికుల చేరవేత ద్వారా గత ఆర్థిక సంవత్సరం కంటే ఈ ఏడాది 10.32 వృద్ధి సాధించి రూ.1,101.4 కోట్ల ఆదాయం గడించింది. అదేవిధంగా టికెట్ లేకుండా ప్రయాణించే వారి ద్వారా ఈ ఏడాది రికార్డ్ స్థాయిలో రూ.14.04 కోట్ల అపరాధ రుసుం వసూలు చేశారు. టార్గెట్ను నిర్ణీత గడువు కంటే 17 రోజులు మందుగానే సాధించడం విశేషం.
ప్రమాదాల నివారణలోనూ భేష్..
గడిచిన రెండేళ్లలో గుంతకల్లు డివిజన్లో ఎలాంటి రైలు ప్రమాదాలు జరగలేదు. ప్రజల సురక్షిత ప్రయాణం కోసం రైల్వే అధికారులు రైల్వే అధికారులు గట్టి చర్యలు చేపట్టారు. సిగ్నలింగ్కు సంబంధించి ‘కవచ్’ వ్యవస్థను కట్టుదిట్టంగా అమలు చేశారు. అలాగే, అధునాతమైన సాంకేతిక పరిజ్ఞానంతో ఆటోమెటిక్ సిగ్నలింగ్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారు. ప్రమాదాల నివారణపై విస్తృతంగా అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఫలితంగా డివిజన్లో గత రెండేళ్లలో రైలు పట్టాలు తప్పిన ఘటనలు జరగలేదు. అంతేకాకుండా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడంలో 94 శాతం కచ్చితత్వం సాధించడం గమనార్హం.
దూసుకెళ్తున్న గుంతకల్లు రైల్వే డివిజన్
2025–26 ఆర్థిక సంవత్సరంలో ఉత్తమ ఫలితాలు
రికార్డు స్థాయిలో ఆదాయం
సరకు రవాణా ద్వారా రూ.2,425 కోట్లు
ప్రయాణికుల చేరవేతలో గత ఏడాది కంటే 10.32 శాతం వృద్ధి
ప్రమాదాల నివారణలోనూ భేష్


