వైఎస్సార్సీపీ నేత దుర్మరణం
● తట్రకల్లు వద్ద చెట్టును ఢీకొన్న కారు
ఉరవకొండ: చెట్టును కారు ఢీకొన్న ఘటనలో వైఎస్సార్సీపీ నేత దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు... ఉరవకొండ పట్టణానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు జంగ్లీ నగేష్ శుక్రవారం ఉదయం తన భార్య రేణుకతో కలసి కర్నూలు జిల్లా డోన్లో సమీప బంధువుల ఇంట జరిగే శుభకార్యానికి కారులో బయలుదేరారు. వజ్రకరూరు మండలం తట్రకల్లు గ్రామ సమీపంలోకి చేరుకోగానే కారు ముందు టైర్లు పంచరు కావడంతో ఒక్కసారిగా అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీకొంది. అటుగా వెళుతున్న వారు ప్రమాదాన్ని గుర్తించి, వెంటనే 108 కు సమాచారం అందించారు. 108 సిబ్బంది అక్కడకు చేరుకునేలోపు నగేష్ మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన రేణుకను వెంటనే ఉరవకొండలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా, ప్రమాదంలో నగేష్ మృతి చెందిన విషయం తెలియగానే ఉరవకొండ వైఎస్సార్సీపీ సమన్వయకర్త వై.విశ్వేశ్వరరెడ్డి ఆగమేఘాలపై ఉరవకొండలోని ప్రభుత్వాస్పత్రికి చేరుకున్నారు. మార్చురీలో ఉంచిన నగేష్ మృతదేహానికి నివాళులర్పించారు. మృతుడి ఇద్దరు కుమారులతో పాటు తండ్రి సిద్దప్పను ఓదార్చారు. ఆయన వెంట పార్టీ నాయకులు వీరన్న, అశోక్, ఈడిగ ప్రసాద్, బసవరాజు, బూదగవి ధనంజయ, ఓబన్న, ఎర్రిస్వామిరెడ్డి, వన్నూరు సాహెబ్, పచ్చి రవి, సతీష్, ఇర్ఫాన్ ఉన్నారు.
చెక్ బౌన్స్ కేసులో ముద్దాయికి ఏడాది జైలు
తాడిపత్రి రూరల్: చెక్ బౌన్స్ కేసులో ముద్దాయికి ఏడాది జైలు శిక్ష విధిస్తూ స్థానిక జేఎఫ్సీఎం న్యాయస్థానం తీర్పు వెలువరించింది. వివరాలను ఈ కేసులో వాది తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది కృష్ణయ్య వెల్లడించారు. గన్నెవారిపల్లి కాలనీకి చెందిన దామోదర్ వద్ద నంద్యాల జిల్లా అంకిరెడ్డిపల్లికి చెందిన శివనాగేశ్వరరెడ్డి అప్పుగా తీసుకున్న నగదు చెల్లింపులకు సంబంధించి అప్పట్లో ఇచ్చిన బ్యాంక్ చెక్ బౌన్స్ అయింది. దీంతో 2018లో బాధితుడు న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. నేరం రుజువు కావడంతో ముద్దాయి శివనాగేశ్వరరెడ్డికి ఏడాది జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి అనిల్కుమార్ నాయక్ శుక్రవారం తీర్పు వెలువరించారు.
వైఎస్సార్సీపీ నేత దుర్మరణం


