విద్యార్థి కాలు విరిచిన ఆట సరదా
గుంతకల్లు టౌన్: సరదా పేరుతో విద్యార్థులు ఆడే ఆటలు తల్లిదండ్రుల్ని తీవ్రవేదనకు గురిచేస్తున్నాయి. స్థానిక లోని రోటరీ హైస్కూల్లో జరిగిన ఈ ఘటనే ఓ తార్కాణం. సోమవారం ఉదయం పాఠశాల విరామ సమయంలో స్టేజ్ వద్ద నిలబడిన ఎనిమిదో తరగతి విద్యార్థి శ్రీవర్ధన్ను తొమ్మిదో తరగతి విద్యార్థి విక్రమ్ పైకెత్తి కిడ్స్ ప్లే జోన్లోకి కింద పడేశాడు. దీంతో గాయపడిన శ్రీవర్ధన్ బాధ తాళలేక గట్టిగా కేక వేయడంతో గమనించిన ఉపాధ్యాయులు వెంటనే స్థానిక ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. శ్రీవర్ధన్ ఎడమ కాలి తుంటి ఎముక విరిగినట్లు ఎక్స్రే ఆధారంగా వైద్యులు నిర్ధారించడంతో పాఠశాల యాజమాన్యం ఏర్పాటు చేసిన అంబులెన్స్లో అనంతపురంలోని ఓ ప్రైవేట్ నర్సింగ్హోమ్కు పాఠశాల హెచ్ఎం వరలక్ష్మి తరలించారు. బేల్దారి పని కోసమని గూళ్లపాళ్యంకు వెళ్లిన బాలుడి తల్లిదండ్రులు నారాయణస్వామి, ధనలక్ష్మి హుటాహుటిన పాఠశాలకు చేరకుని టీచర్లతో కలిసి అనంతపురానికి వెళ్లారు. విషయం తెలుసుకున్న వన్టౌన్ పోలీసులు ఆస్పత్రిలో బాలుడిని పరామర్శించారు.


