చుక్కలు, 22ఏ భూముల ఫైళ్లు ఆమోదం
అనంతపురం అర్బన్: చుక్కల భూములు, 22ఏ (నిషేధిత భూముల)కు సబంధించి 253 ఫైళ్లకు కలెక్టర్ ఆమోదం తెలిపారు. ఆర్డీఓ పర్యవేక్షణలో తహసీల్దార్ల నేతృత్వంలో రెవెన్యూ సిబ్బంది ఈ నెల 12, 13 తేదీల్లో కలెక్టరేట్ రెవెన్యూ భవన్లో చుక్కలు, 22ఏ భూముల ఫైళ్లను సిద్ధం చేశారు. 531 చుక్కలు భూముల, 22ఏ భూములకు సంబంధించి 214 ఫైళ్లను మొత్తం 745 సిద్ధం చేసి ఆమోదం కోసం కలెక్టర్కు సమర్పించారు. వీటిని పరిశీలించిన కలెక్టర్ నిబంధనల ప్రకారం ఉన్న చుక్కల భూములకు సంబంధించి 158 పైళ్లను ఆమోదించారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న 373 ఫైళ్లను తిరస్కరించారు. అదే విధంగా 22ఏ ఫైళ్లకు సంబంధించి 95 ఫైళ్లను ఆమోదించగా, 119 ఫైళ్లను తిరస్కరించారు.
బీఎల్ఓల మెడపై ఓటర్ మ్యాపింగ్ కత్తి
● 282 మంది బీఎల్ఓలకు షోకాజ్ నోటీసు
అనంతపురం అర్బన్: సచివాలయ ఉద్యోగులపై ప్రభుత్వం కత్తిపెట్టి పనిచేయిస్తోంది. ఓటరు మ్యాపింగ్ చేయాలంటూ తీవ్ర ఒత్తిడికి గురిచేస్తోంది. ఎంత చేసినా.. తక్కువగానే చేశారంటూ బీఎల్ఓలకు (బూత్ లెవల్ అధికారులు) షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో అనంతపురం అర్బన్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి (ఈఆర్ఓ), ఆర్డీఓ కేశవనాయుడు నియోజకవర్గం పరిధిలోని 282 మంది బీఎల్ఓలకు షోకాజ్ నోటీసును మంగళవారం జారీ చేశారు. ఓటర్ మ్యాపింగ్ ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించామన్నారు. మ్యాపింగ్ వేగవంతానికి సూపర్వైజర్లు, బీఎల్ఓలతో పలుమార్లు సమావేశం నిర్వహించామన్నారు. పదేపదే ఆదేశాలిచ్చినప్పటికీ ఓటర్ మ్యాపింగ్ ప్రాముఖ్యతను బీఎల్ఓలు గుర్తించడం లేదన్నారు. ఇప్పటికీ 30 నుంచి 40 శాతం మాత్రమే మ్యాపింగ్ జరిగిందన్నారు. గడిచిన 24 గంటల్లో ఒక్కొక్క బీఎల్ఓ ఐదుకు మించి మ్యాపింగ్ చేయలేదని, కొందరు ఒకట్రెండు, ఇంకొందరు ఒక్క మ్యాపింగ్ కూడా చేయలేదని పేర్కొన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే తీవ్ర చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
కుమారస్వామిరెడ్డికి జిల్లా రిజిస్ట్రార్గా పదోన్నతి
అనంతపురం టౌన్: జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయంలో సీనియర్ సబ్ రిజిస్ట్రార్గా పని చేస్తున్న సి.కుమారస్వామిరెడ్డికి జిల్లా రిజిస్ట్రార్(డీఆర్)గా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్లకు జిల్లా రిజిస్ట్రార్లుగా పదోన్నతి కల్పించడంలో భాగంగా అనంతపురంలో ఎస్ఆర్గా పని చేస్తున్న కుమారస్వామిరెడ్డిని శ్రీకాకుళం జిల్లా రిజిస్ట్రార్గా నియమించారు. జిల్లాలో సబ్ రిజిస్ట్రార్గా సుదీర్ఘకాలం పాటు చిలమత్తూరు, గుంతకల్లు, తాడిపత్రి, కదిరి, అనంతపురం, పెనుకొండలో పని చేశారు. ప్రస్తుతం అనంతపురం చిట్స్ విభాగం అసిస్టెంట్ రిజిస్ట్రార్గా పని చేస్తున్న కుమారస్వామిరెడ్డి జిల్లా రిజిస్ట్రార్గా పదోన్నతి పొందారు. మరో రెండు రోజుల్లో ఆయన శ్రీకాకుళంలో బాధ్యతలు చేపట్టనున్నారు.
చుక్కలు, 22ఏ భూముల ఫైళ్లు ఆమోదం


