జంబుకేశ్వరుడికి ద్రాక్షపండ్లతో అలంకరణ
రాయదుర్గంటౌన్: పట్టణంలోని కోటలో వెలసిన స్వయంభు జంబుకేశ్వరస్వామికి సోమవారం విశేష పూజలు జరిగాయి. మూలవిరాట్కు ద్రాక్షపండ్లతో చేసిన ప్రత్యేక అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. అర్చకులు రామకృష్ణశర్మ ఆధ్వర్యంలో పూజలు జరిగాయి.
కాచిగూడ–తిరుపతి మధ్య వన్ వే స్పెషల్ ట్రైన్
గుంతకల్లు: ప్రయాణికుల రద్దీ దృష్టిలో ఉంచుకుని కాచిగూడ–తిరుపతి మధ్య ఈ నెల 12న వన్ వే స్పెషల్ ఎక్స్ప్రెస్ రైలు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ ఎ.శ్రీధర్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ రైలు (07511) 12వ తేదీ మధ్యాహ్నం 3.45 గంటలకు కాచిగూడ రైల్వేస్టేషన్ నుంచి బయలుదేరి మరుసటి రోజు తెల్లవారుజామున 3.45 గంటలకు తిరుపతి రైల్వే జంక్షన్కు చేరుకుంటుందని పేర్కొన్నారు. ఈ రైలు ఉందానగర్, షాద్నగర్, జడ్చర్ల, మహబూబ్నగర్, వనపర్తి రోడ్డు, గద్వాల, కర్నూలు సిటీ, డోన్, గుత్తి, తాడిపత్రి, యర్రగుంట్ల, కడప, ఒంటిమిట్ట, రాజంపేట, రేణిగుంట రైల్వేస్టేషన్ల మీదుగా తిరుపతికి చేరుకుంటుందని తెలిపారు. ఇందులో 3ఏ, చైర్ కార్, జనరల్, సెకండ్ క్లాస్ కోచ్లు అందుబాటులో ఉంటాయని వివరించారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఆర్థిక అక్షరాస్యతతో
సరైన నిర్ణయాలు
అనంతపురం అర్బన్: ఆర్థిక అక్షరాస్యత ద్వారా సరైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడం సాధ్యమవుతుందని కలెక్టర్ ఆనంద్ స్పష్టం చేశారు. ప్రజల్లో ఆర్థిక అవగాహన పెంచేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆధ్వర్యంలో ఈ నెల 13 వరకు ఆర్థిక అక్షరాస్యత వారోత్సవం నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో కలెక్టర్ ఇందుకు సంబంధించిన పోస్టర్లను సోమవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో ఎల్డీఎం నరేష్రెడ్డితో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్థిక అక్షరాస్యత వారోత్సవం ద్వారా సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకూ బాధ్యతాయుతమైన ఆర్థిక ప్రవర్తనపై అవగాహన కల్పించడం ప్రధాన లక్ష్యమన్నారు. వారోత్సవం సందర్భంగా బ్యాకింగ్ సేవలు, బీమా, పెన్షన్ పథకాలు, డిజిటల్ ఆర్థిక భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఎల్డీఎం తెలిపారు.
బేబీ కిట్లు.. ఇస్తే ఒట్టు..!
● ఆగిపోయిన కిట్ల సరఫరా
● పట్టించుకోని చంద్రబాబు ప్రభుత్వం
ఉరవకొండ రూరల్: ప్రభుత్వాస్పత్రుల్లో నవజాత శిశువులకు బేబీ కిట్లు అందడం లేదు. పేద కుటుంబాలకు చెందిన గర్భిణులు ఎక్కువగా ప్రభుత్వాస్పత్రుల్లోనే ప్రసవం చేయించుకుంటారు. నవజాత శిశువులకు బేబీ సోప్, ఆయిల్, పౌడర్, షాంపూ, దోమతెర, బేబీ బెడ్, దుస్తులు, న్యాప్కిన్స్, డైపర్లు తదితర వస్తువులతో కూడిన కిట్ను గత ప్రభుత్వం ఉచితంగా అందించేది. ఇది పేదలకు ఆర్థికంగా ఎంతో ఉపశమనం కలిగించేది. గత వైఎస్సార్సీపీ హయాంలో ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవమైన వారికి బేబీ కిట్లు ఠంచన్గా అందించేది. చంద్రబాబు ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత బేబీ కిట్ల సరఫరా ఆగిపోయింది. దీంతో కూలీనాలి చేసుకునే బతికే తాము వేల రూపాయలు పెట్టి కొనుక్కోవాల్సిన దుస్థితి ఏర్పడిందని బాలింత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉరవకొండ ప్రభుత్వాస్పత్రితో పాటు రాకెట్ల, పెద్దకౌకుంట్లలో పీహెచ్సీలు ఉన్నాయి. ఈ మూడు ఆస్పత్రుల్లో నెలకు సగటున 50 వరకు ప్రసవాలు జరుగుతున్నాయి. అయితే ఒక్కరికీ బేబీ కిట్లు అందించిన దాఖలాలు లేవు. ఉరవకొండ మండలమే కాకుండా జిల్లా అంతటా ఇదే పరిస్థితి ఉన్నట్లు ప్రజలు చెబుతున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం బేబీ కిట్ల సరఫరాకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
జంబుకేశ్వరుడికి ద్రాక్షపండ్లతో అలంకరణ
జంబుకేశ్వరుడికి ద్రాక్షపండ్లతో అలంకరణ


