ధరల పతనంతో వంగ రైతు బెంగ
గుత్తి రూరల్: మార్కెట్లో వంకాయ పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో గుత్తి మండలం బేతాపల్లికి చెందిన రైతు నరేష్.. పంట మొత్తాన్ని గొర్రెలకు ఆహారంగా వదిలేశాడు. తనకున్న భూమిలో నుంచి ఒకటిన్నర ఎకరా విస్తీర్ణంలో సిమ్రాన్ రకం వంకాయ మొక్కలను గత నవంబర్లో రైతు నాటాడు. నార, ఎరువులు, కూలీలు, మందుల పిచికారీ తదితరాలకు రూ.80 వేలు ఖర్చు చేశాడు. మూడు నెలల పాటు పంట సంరక్షణకు మరో రూ.50 వేలు ఖర్చైంది. మంచి దిగుబడి రావడంతో ఈ ఏడాది అప్పులు తీరి తన కష్టాలు దూరమవుతాయని రైతు భావించాడు. వారం క్రితం పంట కోత కోసి ఒక్కో బస్తాలో 20 కిలోల చొప్పున మొత్తం 120 బస్తాల్లో 2.40 క్వింటాళ్ల దిగుబడిని మార్కెట్కు తరలిస్తే ఒక్కో బస్తా రూ.30 చొప్పున దళారులు అడగడంతో రైతు తీవ్రంగా నష్టపోయాడు. గతంలో 20 కిలోల బస్తా రూ.300 నుంచి రూ.500 వరకూ అమ్ముడు పోయిందని, ఈ లెక్కన రూ.5 లక్షలు వస్తుందని ఎంతో ఆశతో మార్కెట్కు పంట తరలిస్తే చివరకు రూ.50 వేలు కూడా చేతికి అందలేదని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక చేసేది లేక పంట మొత్తాన్ని గొర్రెలకు వదిలేసినట్లుగా తెలిపాడు.


