కోర్టు ఉద్యోగాలకు 19న ఎంపిక పరీక్షలు
అనంతపురం: అనంతపురం జిల్లా న్యాయ సేవా అధికార సంస్థలో ఉద్యోగాల భర్తీ కోసం ఈ నెల 19న ఎంపిక పరీక్షలు నిర్వహించనున్నట్లు ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఇ.భీమారావు తెలిపారు. ఈమేరకు ఆయన సోమవారం ఎంపిక పరీక్ష వివరాలను మీడియాకు వెల్లడించారు. అనంతపురం సమీపంలోని రుద్రంపేట పరిధిలోని శ్రీ బాలాజీ పీజీ కాలేజ్, పీవీకేకే ఇంజినీరింగ్ కాలేజీలో పరీక్షలు ఉంటాయని పేర్కొన్నారు. అభ్యర్థులు నిర్దేశించిన సమయానికి గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. ఫ్రంట్ ఆఫీస్ కోఆర్డినేటర్ ఉద్యోగం ఎంపిక పరీక్ష మధ్యాహ్నం 12: 30కు ప్రారంభమవుతుందని, కాల వ్యవధి 90 నిమిషాలు ఉంటుందన్నారు. రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగ ఎంపిక పరీక్ష మధ్యాహ్నం 3: 30 గంటలకు ప్రారంభమవుతుందన్నారు. డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుకు జరగాల్సిన పరీక్ష హైకోర్టు ఉత్తర్వుల మేరకు నిలుపుదల చేసినట్లు పేర్కొన్నారు. తదుపరి హైకోర్టు ఆదేశాల మేరకు తేదీ వెల్లడిస్తామని చెప్పారు. అభ్యర్థుల వివరాలు జిల్లా కోర్టు వెబ్సైట్లో పొందుపరుస్తామన్నారు. అర్హులైన వారికి హాల్ టికెట్లు రాకపోతే అనంతపురం జిల్లా న్యాయ సేవా అధికార సంస్థను సంప్రదించాలని సూచించారు.
నులి పురుగులను నులిమేద్దాం
గార్లదిన్నె: రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవం నిర్వహిస్తున్నామని వైద్య, ఆరోగ్య శాఖ స్టేట్ మానిటరింగ్ అధికారి డాక్టర్ అనిల్కుమార్ తెలిపారు. 1 – 19 ఏళ్లలోపు ఉన్న పిల్లలందరికీ ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. సోమవారం గార్లదిన్నె కేజీబీవీలో నులి పురుగుల నివారణ మందుల పంపిణీ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా డాక్టర్ అనిల్కుమార్ మాట్లాడుతూ 19 ఏళ్లలోపు పిల్లలకు ఆల్బెండ జోల్ మాత్రలు వేయడం ద్వారా పేగుల్లోని పురుగులను నిర్మూలించి, రక్తహీనత, పోషకాహార లోపాన్ని అరికట్టవచ్చని చెప్పారు. కార్యక్రమంలో యూనిసెఫ్ మెంబర్ డాక్టర్ నాగేంద్ర, డాక్టర్ విష్ణు, డాక్టర్ నారాయణస్వామి, గార్లదిన్నె పీహెచ్సీ డాక్టర్ ఉదయ్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
భక్తులకు ఇబ్బందులు రానీయొద్దు
అమరాపురం: హేమావతి సిద్ధేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం నిర్వహించే అగ్నిగుండ ఉత్సవానికి విచ్చేసే భక్తులకు ఇబ్బందులు కలగకుండా భద్రతా ఏర్పాట్లు చేయాలని ఎస్పీ సతీష్కుమార్ పోలీసులకు సూచించారు. సోమవారం ఆయన సిద్ధేశ్వరస్వామి ఆలయాన్ని సందర్శించి పూజలు చేశారు. అనంతరం సీఐ రాజ్కుమార్, ఎస్ఐ వలిబాషా, సిబ్బందితో పాటు ఉత్సవ కమిటీ చైర్మన్ కరేగౌడతో భద్రతా ఏర్పాట్లపై సమీక్షించారు. వృద్ధులు, దివ్యాంగులు, మహిళలు, చిన్నారుల కోసం ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటుచేయాలన్నారు. ట్రాఫిక్ క్రమబద్దీ కరణ, ప్రసాదం కౌంటర్లు, అన్న ప్రసాద పంపిణీని ప్రత్యక్షంగా పరిశీలించారు.
కోర్టు ఉద్యోగాలకు 19న ఎంపిక పరీక్షలు


