రైతులకు లబ్ధిచేకూర్చడమే లక్ష్యం
● డ్రోన్ సేవలందించాలి : కలెక్టర్
అనంతపురం అర్బన్: రైతులకు లబ్ధి చేకూర్చడమే లక్ష్యంగా చర్యలు ఉండాలని కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ బుధవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో వ్యవసాయ, ఉద్యాన, అనుబంధ శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కిసాన్ డ్రోన్ ఉబరైజేషన్ కింద 4,256 మంది రైతులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, వీరందరికీ డ్రోన్ సేవలు అందించాలని ఆదేశించారు. ఏపీఎఫ్ఆర్ (ఏపీ ఫార్మర్ రిజిస్ట్రీ) పెండింగ్ ఈ నెలాఖరుకు పూర్తి చేయాలన్నారు. ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన కింద ప్రణాళిక రూపొందించుకుని కేటాయించిన లక్ష్యాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు. ఏపీఎంఐపీకి సంబంధించి నాన్సబ్సిడీ కలెక్షన్ల విషయంలో లక్ష్యాన్ని వందశాతం చేరుకోవాలని చెప్పారు. అరటి, దానిమ్మ, మిరప, తదితర ఉద్యాన పంటల విస్తీర్ణం పెంచాలన్నారు. సమావేశంలో జిల్లా వ్యవసాయాధికారి రవి, ఉద్యాన శాఖ అధికారి ఉమాదేవి, ఏపీఎంఐపీ పీడీ రఘునాథరెడ్డి, మార్క్ఫెడ్ డీఎం పెన్నేశ్వరి, డీఆర్డీఏ పీడీ శైలజ, పశుసంవర్ధక శాఖ జేడీ ప్రేమ్చంద్, మార్కెటింగ్ ఏడీ రాఘవేంద్రకుమార్, డీసీఓ అరుణకుమారి, ఆత్మా పీడీ పద్మలత, ఎల్డీఎం నరేష్రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
నేడు విజయవాడకు కలెక్టర్
సెన్సస్–2027 (జనాభా లెక్కల)పై విజయవాడలో ఈ నెల 20న నిర్వహించనున్న ఒక్క రోజు శిక్షణకు కలెక్టర్ ఆనంద్ గురువారం బయలుదేరి వెళ్లనున్నారు. కలెక్టర్తో పాటు డీఆర్ఓ మలోల కూడా శిక్షణకు హాజరుకానున్నారు. వారు తిరిగి 21వ తేదీ విధులకు హాజరు కానున్నారు.


