మామిడి తోటకు నిప్పు
పుట్లూరు: మండలంలోని బాలాపురం సమీపంలో ఉన్న వైఎస్సార్సీపీ ప్రచార విభాగం మండల కన్వీనర్ పవన్కుమార్ మామిడి తోటకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. ఈ విషయం బుధవారం వెలుగులోకి వచ్చింది. ఎల్లుట్ల గ్రామానికి చెందిన పవన్కుమార్ బాలాపురం సమీపంలో ఉన్న 4 ఎకరాల్లో 15 సంవత్సరాలుగా మామిడి తోటను సాగు చేస్తున్నాడు. వారం రోజుల క్రితం శ్రీశైలం వెళ్లి తిరిగి వచ్చాడు. బుధవారం తోట వద్దకు వెళ్లగా జరిగిన నష్టాన్ని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేఽశాడు. ఘటనతో పూత దశలో ఉన్న 70 మామిడి చెట్లు మాడిపోయాయని, డ్రిప్పు పరికరాలు విద్యుత్ మోటార్, కేబుల్ కాలిపోయిందని వివరించాడు. రూ. 2 లక్షల మేర నష్టం వాటిల్లిందని వాపోయాడు.
23న కలెక్టరేట్ ఎదుట
కౌలు రైతుల నిరసన
అనంతపురం అర్బన్: అన్నదాత సుఖీభవ కింద ప్రతి కౌలు రైతుకూ రూ.20 వేలు ఇవ్వాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని కౌలు రైతు, రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక ఆ సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నిరసన దీక్ష పోస్టర్లను వారు విడుదల చేసి, మాట్లాడారు. నూతన కౌలు చట్టం చేయాలని, ఎలాంటి షరతులు లేకుండా పంట రుణాలు, సబ్సిడీ విత్తనాలు, పురుగు మందులు ఇవ్వాలన్నారు. కౌలు రైతులు పండించిన పంటలను వారి పేరున కొనుగోలు చేసి ఖాతాల్లో డబ్బులు జమ చేయాలన్నారు. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుకు సంబంధించి వారి కుటుంబానికి రూ.25 లక్షలు ఎక్స్గ్రేషియా చెల్లించాలన్నారు. డిమాండ్ల సాధనలో భాగంగా ఈ నెల 23, 24 తేదీల్లో కలెక్టరేట్ ఎదుట 36 గంటల నిరసన దీక్షను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కౌలు రైతు సంఘం, రైతు సంఘం జిల్లా కార్యదర్శులు బాలరంగయ్య, చంద్రశేఖర్రెడ్డి, నాయకులు బీహెచ్రాయుడు, వెంకటేషులు, సురేష్, సుంకన్న, తదితరులు పాల్గొన్నారు.
మామిడి తోటకు నిప్పు


