కేశవ్ అండతోనే మట్టి దోపిడీ
ఉరవకొండ: మంత్రి పయ్యావుల కేశవ్ అండతోనే టీడీపీ నేతలు ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పెన్నహోబిలం లక్ష్మీనృసింహస్వామి ఆలయ పరిసరాల్లో మట్టి దోపిడీకి పాల్పడుతున్నారని వైఎస్సార్సీపీ నేతలు ఆరోపించారు. గురువారం పెన్నహోబిలం ఆలయ కమిటీ మాజీ చైర్మన్, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ముత్తూలురు అశోక్, రూరల్ పరిశీలకులు డిష్ సురేష్, బీసీ సెల్ జిల్లా కార్యదర్శి కౌడిగి గోవిందు, పార్టీ యువజన విభాగం రాష్ట్ర నాయకుడు ముస్టురు నరేష్ తదితరులు క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇష్టారాజ్యంగా సహజ సంపదను దోపిడీ చేస్తున్నారన్నారు. అక్రమాలపై ప్రశ్నించే వారు ఉండకూడదన్న ఉద్దేశంతోనే పెన్నహోబిలం ఆలయానికి ఈఓను సైతం నియమించలేదన్నారు. పెద్ద ఎత్తున మట్టి దోపిడీ జరుగుతున్నా దేవదాయ శాఖ, మైనింగ్ అధికారులు పట్టించుకోవడం దుర్మార్గమన్నారు. ఇకపై సహజ సంపద దోపిడీ జరగకుండా వైఎస్సార్సీపీ అడ్డుకుంటుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు జయరాం, షేక్షానుపల్లి రమేష్, చంద్ర, నీలప్ప తదితరులు పాల్గొన్నారు.


