ఆర్డీటీని కాపాడుకుందాం
● ఉద్యమాలతోనే అది సాధ్యం
● చంద్రబాబు ప్రభుత్వం స్పందించాలి
● రౌండ్ టేబుల్
సమావేశంలో వక్తలు
రమేష్ గౌడ్ ప్రసంగానికి
అడుగడుగునా అడ్డంకులు
రౌండ్ టేబుల్ సమావేశంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి, బీసీ సెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్గౌడ్ ప్రసంగానికి టీడీపీ నగర అధ్యక్షుడు సుధాకర్ యాదవ్ అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. రమేష్గౌడ్ మాట్లాడుతూ ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏ లైసెన్స్ రెన్యూవల్ చేయించడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. దీనివల్ల ఉమ్మడి జిల్లాతో పాటు పలు ప్రాంతాల్లో పేదలకు సంస్థ సేవలు దూరమయ్యే పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయన్నారు. ఈ క్రమంలో సుధాకర్ యాదవ్ జోక్యం చేసుకుని సమావేశాన్ని రసాభాసగా మార్చాడు. అతని తీరును సమావేశంలో పాల్గొన్న ఇతర పార్టీలు, ప్రజాసంఘాల నేతలు తప్పుబట్టారు. ‘వాస్తవాలు మాట్లాడితే ఎందుకు జీర్ణించుకోలేకపోతున్నారు? ఆర్డీటీ విషయంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైంది నిజం కాదా?’ అంటూ నిలదీశారు. దీంతో సుధాకర్ యాదవ్ తోక ముడిచాడు.
అనంతపురం టవర్క్లాక్: ఉద్యమాలు చేసైనా ఆర్డీటీని కాపాడుకుందామని వక్తలు పిలుపునిచ్చారు. శనివారం స్థానిక ప్రెస్క్లబ్లో సీపీఐ ఆధ్యర్యంలో అఖిల పక్ష నాయకుల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సీపీఐ జిల్లా కార్యదర్శి నారాయణ స్వామి అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, మేయర్ వసీం, డిప్యూటీ మేయర్ కోగటం విజయభాస్కర్ రెడ్డి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి రమేష్ గౌడ్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు దేవరగుడి జగదీష్, సీపీఎం జిల్లా కార్యదర్శి ఓ. నల్లప్ప, వైఎస్సార్సీపీ నగర అధ్యక్షుడు చింతా సోమశేఖర్ రెడ్డి, ముతవల్లి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు షకీల్ షఫి, ఇస్సాక్, రాష్ట్ర కార్యదర్శి జాఫర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్పర్సన్ గిరిజమ్మ మాట్లాడుతూ జిల్లాలో పేద పిల్లలను ఆర్డీటీ సంస్థ అక్కున చేర్చుకుని చదివించిందన్నారు. పేదల కోసం ఆసుపత్రులు ఏర్పాటు చేసి వైద్య సేవలు అందించారన్నారు. దివ్యాంగులకు సహాయ సహకారాలు అందించి వారిలో మనోధైర్యం నింపారన్నారు. క్రీడాభివృద్ధికి విశేష కృషి చేసి పేద విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదిగేలా ప్రోత్సహించారన్నారు. అటువంటి సంస్థకు కేంద్ర ప్రభుత్వం ఎఫ్సీఆర్ఏ రెన్యూవల్ చేయకుండా కక్షపూరితంగా వ్యవహరిస్తోందన్నారు. ఆర్డీటీ కోసం ఏ కార్యక్రమాలు చేసినా వైఎస్సార్ సీపీ మద్దతు ఇస్తుందని తెలిపారు.
సీఎం చంద్రబాబు స్పందించాలి..
మేయర్ వసీం మాట్లాడుతూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆర్డీటీ ఎఫ్సీఆర్ఏ పునరుద్ధరణ అంశంపై కేంద్రంతో మాట్లాడాలన్నారు. చంద్రబాబు రూ. 400 కోట్ల బడ్జెట్ కేటాయించి ఆర్డీటీని కాపాడాలన్నారు. డిప్యూటీ మేయర్ కోగటం విజయ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు గడుస్తున్నా ఎఫ్సీఆర్ఏ రెన్యూవల్ చేయించలేదన్నారు. వీధి పోరా టాలతో లక్ష్యం సాధించలేమని, చలో అమరావతికి పిలుపునివ్వాలని సూచించారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి రమేష్ గౌడ్ మాట్లాడుతూ ఆర్డీటీ లేని అనంతపురం జిల్లాను ఊహించుకోలేమన్నారు. సంస్థకు జరుగుతున్న అన్యాయంపై ప్రశ్నించినా చంద్రబాబు ప్రభుత్వం తప్పు పడుతోందని విమర్శించారు. ఆర్డీటీని కాపాడుకోకపోతే భవిష్యత్ తరాలకు నష్టం వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు దేవరగుడి జగదీష్ మాట్లాడుతూ ఆర్డీటీని కాపాడుకునేందుకు చేసే ఉద్యమాల్లో అన్ని రాజకీయ పార్టీలు పాల్గొనాలన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి నల్లప్ప మాట్లాడుతూ బలమైన ఉద్యమాలతోనే ఆర్డీటీని కాపాడుకోగలమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో మాట్లాడి ఆర్డీటీని కాపాడాలన్నారు. కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షుడు సుధాకర్ యాదవ్, సీపీఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి వేమన, పులి కిష్ట, మాజీ సైనిక అధికారి షేకన్న, వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ నాయకులు ఓబిరెడ్డి, కార్పొరేటర్ చంద్రలేఖ, నాయకురాలు కమర్ తాజ్, సీపీఐ నాయకుడు మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.


