బోయ ఆనంద్ది పరువు హత్యే
● లోకాయుక్తకు ఫిర్యాదు చేసిన
హతుడి సోదరి పూజ
కళ్యాణదుర్గం: బ్రహ్మసముద్రం మండలం యనకల్లుకు చెందిన బోయ ఆనంద్ది పరువు హత్య అని, నిందితులను కఠినంగా శిక్షించాలని బాధితుల పక్షాన కళ్యాణదుర్గం వైఎస్సార్సీపీ సమన్వయకర్త డాక్టర్ తలారి రంగయ్య పోరాటం చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ఘటనపై హతుడి సోదరి లోకాయుక్తను ఆశ్రయించారు. బోయ ఆనంద్ది ముమ్మాటికీ పరువు హత్యేనని ఫిర్యాదు చేశారు. వివరాలను ఆమె శుక్రవారం వెల్లడించారు. బెంగళూరులోని ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న బోయ ఆనంద్ను ప్రేమిస్తున్నానంటూ కళ్యాణదుర్గంలో నివాసముంటున్న కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఓ వివాహిత నమ్మించి, తన భర్త నుంచి విడాకులు తీసుకుంటానని, పెళ్లి చేసుకుందామంటూ 2025, నవంబర్ 20న కళ్యాణదుర్గానికి పిలిపించుకుందన్నారు. మరుసటి రోజు 21న బోయ ఆనంద్ అనుమానాస్పద స్థితిలో మృతదేహమై కనిపించాడన్నారు. ఆనంద్ సెల్ఫోన్లో మెసేజ్లు, ఆడియో, వీడియో రికార్డింగ్ ఉండడంతో.. తమ కుమారుడిది ఆత్మహత్య కాదని అది ముమ్మాటికే హత్యేనని అప్పట్లో కుటుంబ సభ్యులు భావించారు. అమ్మాయి తరపున బంధువులే పథకం ప్రకారం బెంగళూరు నుంచి రప్పించి కొట్టి, బలవంతంగా పురుగుల మందు తాపించారని అనుమానం వ్యక్తం చేశారు. ఇదంతా టీడీపీ నేతల ఒత్తిళ్లే ఇందుకు కారణంగా పోలీసుల ప్రాథమిక దర్యాప్తులోనూ నిర్ధారణ అయిందన్నారు. ఇదంతా పోలీసులకు తెలిసినా రూ.7 లక్షలు లంచం తీసుకుని సీఐ హరినాథ్ కేసును తారుమారు చేశారని ఆరోపించారు. ఇదే విషయాన్ని నిందితులే బహిరంగంగా చెప్పుకుంటూ తిరుగుతున్నారని, వారి బెదిరింపులకు తన కుటుంబసభ్యులు గ్రామం విడిచి మూడు నెలలుగా బంధువుల ఇళ్లలో తలదాచుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పరువు హత్యకు ప్రాథమిక ఆధారాలున్నా నిందితులపై పోలీసులు చర్యలు తీసుకోవడం లేదంటూ లోకాయుక్తకు ఫిర్యాదు చేసినట్లు వివరించారు.


