కోర్టు భవనం పైకెక్కి వ్యక్తి హల్చల్
ఉరవకొండ: ఓ కేసు విషయంలో తనకు పోలీసులు న్యాయం చేయడం లేదంటూ ఓ వ్యక్తి కోర్టు భవనం పైకెక్కి కిందకు దూకుతానంటూ కలకలం సృష్టించాడు. న్యాయమూర్తి అక్కడికి చేరుకుని తనకు హామీనిస్తే తప్ప కిందకు దిగనంటూ భీష్మించాడు. ఈ ఘటనతో కోర్టు పరిసరాల్లో ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని సదరు వ్యక్తిని ఉరవకొండకు చెందిన రాజశేఖర్గా గుర్తించి, సముదాయించి కిందకు దించారు. అనంతరం ఆస్పత్రికి తరలించారు. ఈ విషయంగా పోలీసులు మాట్లాడుతూ.. రాజశేఖర్ మానసిక స్థితి సరిగా లేదని పేర్కొన్నారు. కొన్ని నెలల క్రితం గొంతు కోసుకుని చికిత్సకు సహకరించకుండా ఆస్పత్రి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించినట్లు గుర్తు చేశారు.


