నేటి ‘పరిష్కార వేదిక’ రద్దు
అనంతపురం అర్బన్: కలెక్టరేట్లో సోమవారం నిర్వహించాల్సిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలను రద్దు చేసినట్లు కలెక్టర్ ఆనంద్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో సోమవారం ఉదయం 10.30 గంటలకు విజయవాడలో నిర్వహించనున్న మంత్రులు, కార్యదర్శులు, హెచ్ఓడీల కాన్ఫరెన్స్ ఉన్నందున ‘పరిష్కార వేదిక’ రద్దు చేసినట్లు పేర్కొన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.
అందరూ హాజరవ్వాలి..
సీఎం కాన్ఫరెన్స్కు జిల్లాస్థాయిలో కలెక్టర్, ఎస్పీ, హెచ్ఓడీలు కలెక్టరేట్లో హాజరు కానున్నట్లు కలెక్టర్ తెలిపారు. అదే విధంగా డివిజన్ స్థాయిలో ఆర్డీఓలు, డీఎల్డీఓలు, డీఎల్పీఓలు, ఇతర డివిజన్ స్థాయి అధికారులు ఆర్డీఓ కార్యాలయం నుంచి హాజరు కావాలని చెప్పారు. ఇక మండల, పురపాలక స్థాయిలో తహసీల్దార్లు, ఎంపీడీఓలు, మునిసిపల్ కమిషనర్లు, మండలస్థాయి అధికారులు, తహసీల్దారు లేదా ఎంపీడీఓ కార్యాలయాల్లో ఏదో ఒక చోట హాజరవ్వాలని సూచించారు. స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సచివాలయ సిబ్బంది సచివాలయంలోనే కాన్ఫరెన్స్లో పాల్గొనాలని ఆదేశించారు. అన్నిస్థాయి అధికారులందరూ కచ్చితంగా వర్చువల్ విధానంలో కాన్ఫరెన్స్కు హాజరవ్వాలన్నారు.
పోలీసుల అదుపులో
నకిలీ పత్రాల సృష్టికర్తలు!
పుట్టపర్తి టౌన్: ఓ గృహాన్ని అక్రమంగా కొట్టేసేందుకు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించిన పుట్టపర్తికి చెందిన టీడీపీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం మేరకు.. అనంతపురం నగరంలోని శారద నగర్లో కనకదర్గ అనే సత్యసాయి భక్తురాలు 1980 సంవత్సరంలో 6.43 సెంట్ల స్థలం కొనుగోలు చేసి ఇల్లు నిర్మించుకున్నారు. సత్యసాయి కళాశాలలో అధ్యాపకురాలుగా పనిచేసిన ఆమె పదవీ విరమణ తరువాత తన సోదరి శ్రీలక్ష్మితో కలసి శారదానగర్లో నివసించేవారు. వ్యక్తిగత పని నిమిత్తం గత ఏడాది నవంబర్లో రాజమండ్రికి వెళ్లిన కనకదుర్గ, శ్రీలక్ష్మిలు అక్కడ జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ క్రమంలోనే అనంతపురం నగరానికి చెందిన ఓ టీడీపీ నేత వారి ఇంటిని కొట్టేసేందుకు పన్నాగం పన్నాడు. కనకదుర్గ జీవించి ఉన్న సమయంలో హిందూపురం ప్రాంతానికి చెందిన శకుంతల ఆమె బాగోగులు చూసిందని, అందుకు ప్రతిఫలంగా తన ఇంటిని ఆమెకు రాసివ్వగా.. శకుంతల ఆ ఇంటిని పుట్టపర్తికి చెందిన ఈ. శేఖర్కు జీపీఎస్ చేసినట్లు నకిలీ పత్రాలు సృష్టించారు. దీనిపై కనకదుర్గ బంధువులు అనంతపురం ఎస్పీని ఆశ్రయించారు. ఆయన ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు సమగ్ర విచారణ అనంతరం నకిలీ పత్రాలు సృష్టించిన పుట్టపర్తికి చెందిన టీడీపీ నాయకులు ఆవుల సుబ్రమణ్యం, దయ్యాల ఉమాపతి, శేఖర్ను శనివారం రాత్రి అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.
నేటి ‘పరిష్కార వేదిక’ రద్దు


