గుత్తి డీవైఈఓ ఎవరో?
● ఆర్జేడీ చేతికి సీనియార్టీ జాబితా
అనంతపురం ఎడ్యుకేషన్: విద్యాశాఖ గుత్తి డివిజన్ డిప్యూటీ ఎడ్యుకేషనల్ అధికారి (డీవైఈఓ) నియామకంపై సస్పెన్స్ నెలకొంది. డివిజన్ పరిధిలోని ఉన్నత పాఠశాలల పర్యవేక్షణ పూర్తి బాధ్యత వీరిదే కావడంతో డీవైఈఓ పోస్టుకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. ఈ క్రమంలో గుత్తి డీవైఈఓ పోస్టులో మొన్నటి వరకూ బెళుగుప్ప ఎంఈఓ–1 మల్లారెడ్డి పని చేస్తుండేవారు. గత నెల 31న ఆయన ఉద్యోగ విరమణ పొందారు. అప్పటి నుంచి ఈ పోస్టు ఖాళీగా ఉంది. ఈ క్రమంలో ఆ పోస్టు భర్తీకి సంబంధించి హెచ్ఎంల సీనియార్టీ జాబితాను ఆర్జేడీకి జిల్లా విద్యాశాఖ అధికారి నివేదించారు.
అడ్డంకిగా మారిన ‘సెన్సూర్’
హెచ్ఎంల సీనియార్టీ జాబితాలో పామిడి మండలం ఖాదర్పేట జెడ్పీహెచ్ఎస్ హెచ్ఎం పురుషోత్తంబాబు పేరు ఉంది. రెండో స్థానంలో కణేకల్లు ఎంఈఓ–1 లక్ష్మన్న, మూడో స్థానంలో గుంతకల్లు ఎంఈఓ–1 మస్తాన్రావు పేర్లు ఉన్నాయి. అత్యంత సీనియర్గా ఉన్న పురుషోత్తంబాబుకు హెచ్ఎంగా దాదాపు 20 ఏళ్ల అనుభవం ఉంది. అయితే డీసీఈబీ కార్యదర్శిగా పనిచేసిన సమయంలో నిధులు పక్కదారి పట్టించారనే అభియోగాలున్నాయి. ఈ క్రమంలో అప్పట్లో ఆర్జేడీ స్పందించి విచారణకు కూడా ఆదేశించారు. అనంతరం క్రమశిక్షణ చర్యల్లో భాగంగా రెండు నెలల క్రితం ‘సెన్సూర్’ జారీ చేశారు. దీని కారణంగా పురుషోత్తంబాబుకు డీవైఈఓ ఎఫ్ఏసీ బాధ్యతలు అప్పగించడం సాధ్యం కాదని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో రెండో స్థానంలో ఉన్న కనేకల్లు ఎంఈఓ–1 లక్ష్మన్నకే అవకాశం ఉండగా, ఆయన అయిష్టత చూపిస్తే తర్వాత స్థానంలో ఉన్న మస్తాన్రావుకు అవకాశం కల్పించనున్నారు.
ఆర్టీసీ బస్సు, లారీ ఢీ:
10 మందికి గాయాలు
పెనుకొండ రూరల్: ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొన్న ఘటనలో పది మంది గాయపడ్డారు. పెనుకొండ వద్ద 44వ జాతీయ రహదారిపై ఈ సంఘటన చోటు చేసుకొంది. వివరాలు.. ఆదివారం హిందూపురం డిపో నుంచి ప్రయాణికులతో ఆర్టీసీ అద్దె బస్సు ధర్మవరం బయలుదేరింది. మార్గమధ్యంలో పెనుకొండ మండలం గుట్టూరు సమీపంలోని వై జంక్షన్ వద్ద లారీ, బస్సు ఢీకొన్నాయి. ఈ క్రమంలో బస్సు కండక్టర్ చాంద్ బాషా, డ్రైవర్ వెంకటరమణ నాయక్తో పాటు ప్రయాణికులు భాస్కర్, చిన్న నరసప్ప, లక్ష్మమ్మ, సుజాత, కల్పన, వెంకటమ్మ, చెన్నకేశవ, శ్రీనాథ్ గాయపడ్డారు. క్షతగాత్రులను కియా పోలీసులు పెనుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం వైద్యుల సూచన మేరకు కండక్టర్ చాంద్ బాషా, చిన్న అంజనప్ప, కల్పనను హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రమాదంలో బస్సు ముందు భాగం తీవ్రంగా దెబ్బతింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలిసింది. కేసు నమోదు చేసిన కియా పోలీసులు విచారణ చేస్తున్నారు.


