ఆలయంలో వెండి అపహరణ
గార్లదిన్నె: మండల పరిధిలోని జంబులదిన్నె కొట్టాల గ్రామంలోని ఆంజనేయస్వామి దేవాలయంలో దుండగులు 40 తులాల వెండి అపహరించారు. ఎస్ఐ గౌస్ మహమ్మద్ బాషా తెలిపిన మేరకు.. శుక్రవారం అర్ధరాత్రి జంబులదిన్నె కొట్టాల ఆంజనేయస్వామి ఆలయంలోకి తాళాలు పగుల గొట్టి గుర్తు తెలియని వ్యక్తులు ప్రవేశించారు. హుండీతో పాటు 40 తులాల వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లారు. శనివారం ఉదయం ఆలయ షట్టర్ పగులగొట్టిన విషయం గుర్తించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు విచారణ చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
ఉత్సాహంగా క్రీడాపోటీలు
అనంతపురం సెంట్రల్: జిల్లా పోలీసు స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్లో భాగంగా రెండోరోజు శనివారం పలు క్రీడా పోటీలను స్థానిక పరేడ్గ్రౌండ్లో నిర్వహించారు. క్రికెట్, యోగా, కబడ్డీ, బాస్కెట్బాల్, వాలీబాల్, హైజంప్, పరుగు పందెం తదితర పోటీల్లో క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్పీ ఇలియాస్బాషా, ఏఆర్ డీఎస్పీ నీలకంఠేశ్వరరెడ్డి, పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు.


