సుబ్రహ్మణ్యేశ్వరా.. పాహిమాం
● కోటంకలో వైభవంగా రథోత్సవం
గార్లదిన్నె: మండల పరిధిలోని కోటంక కొండల్లో వెలసిన గుంటి కింద సుబ్రహ్మణ్యేశ్వరస్వామి రథోత్సవం శనివారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. ముందుగా ప్రధాన అర్చకులు రామాచార్యులు స్వామివారికి ఏకవార రుద్రాభిషేకం, సహస్ర నామార్చన నిర్వహించారు. స్వామివారి వెండి విగ్రహాలను విద్యుద్దీపాలు, పుష్పాలతో అలంకరించిన రథంలో ఉంచి పురవీధుల్లో రాత్రి రథోత్సవం ప్రారంభించారు. ఈ సందర్భంగా భక్తులు స్వామివారిని మనసారా కీర్తిస్తూ భక్తిపారవశ్యం పొందారు. రథోత్సవాన్ని తిలకించేందుకు జిల్లా నలుమూలల నుంచి భక్తులు తరలిరావడంతో కోటంక కిటకిటలాడింది. కొండల్లో కొలువైన స్వామివారిని భక్తులు దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. తిరునాలలో అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తు చర్యలు చేపట్టారు.


