వెంకన్న ప్రతిష్టను దిగజారుస్తున్న చంద్రబాబు
● గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే వైవీఆర్ మండిపాటు
గుత్తి: సీఎం చంద్రబాబు తన దిగజారుడు వ్యాఖ్యలతో తిరుమల వెంకన్న ప్రతిష్టను దిగుజారుస్తున్నారని గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే వై.వెంకటరామిరెడ్డి అన్నారు. గుత్తి వైఎస్సార్ సీపీ కార్యాలయంలో శనివారం వైఎస్సార్ సీపీ గ్రామ, వార్డు కమిటీల ఏర్పాటుకు నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు, సీబీఐలు తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలవలేదని ప్రకటించినా పట్టించుకోకుండా కూటమి నాయకులు ఇష్టానుసారం మాట్లాడుతున్నారన్నారు. వెంకటేశ్వర స్వామికి దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా భక్తులు ఉన్నారన్నారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానిస్తున్నారన్నారు. భక్తుల మనోభావాలను దెబ్బతీస్తూ వెంకన్న ఆగ్రహానికి గురవుతున్నారన్నారు. జగన్ను ఎదుర్కోలేక కూటమి నాయకులు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని, దీనిపై ప్రశ్నిస్తున్న గొంతుకలను అణచి వేస్తున్నారన్నారు. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్, విడదల రజనిపై దాడులు చేయించారన్నారు. ఇంత కంటే దారుణం ఎక్కడైనా ఉంటుందా అని ప్రశ్నించారు.పార్టీని బలోపేతం చేయడంలో భాగంగా గ్రామ, వార్డు కమిటీలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో పట్టణ, మండల కన్వీనర్లు మధు, గంగరాజు, మాజీ కన్వీనర్ పీరా, డాక్టర్ శాంతి ప్రియ, జిల్లా నాయకులు రామ సుబ్బారెడ్డి, రంగస్వామి, వెల్డింగ్ రవూఫ్, మున్నా, మండల నాయకులు షఫి, రఘు, దేవా, వరదా, సునీల్, గాదిలింగ, కటిక అన్వర్, పలువురు కౌన్సిలర్లు పాల్గొన్నారు.


