క్యాన్సర్ను ప్రారంభ దశలోనే గుర్తించాలి
● డీఎంహెచ్ఓ డాక్టర్ భ్రమరాంబ దేవి
అనంతపురం మెడికల్: క్యాన్సర్ను ప్రారంభ దశలోనే గుర్తించి వైద్యం అందిస్తే మంచి ఫలితాలు సాధించవచ్చని డీఎంహెచ్ఓ డాక్టర్ ఈ భ్రమరాంబ దేవి పేర్కొన్నారు. ప్రపంచ క్యాన్సర్ దినాన్ని పురస్కరించుకుని బుధవారం ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ర్యాలీని డీఎంహెచ్ఓ జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీ డీఎంహెచ్ఓ కార్యాలయం నుంచి తెలుగుతల్లి విగ్రహం వరకు, తిరిగి డీఎంహెచ్ఓ కార్యాలయం వరకు సాగింది. డీఎంహెచ్ఓ మాట్లాడుతూ క్యాన్సర్ నివారణలో భాగంగా క్షేత్రస్థాయిలో స్క్రీనింగ్ పక్కాగా చేపట్టాలన్నారు. జీవన శైలిలోనూ మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. 30 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ఆస్పత్రుల్లో నిర్వహించే ఉచిత స్క్రీనింగ్ కార్యక్రమానికి హాజరవ్వాలన్నారు. మహిళల్లో సర్వైకల్, బ్రెస్ట్, పురుషుల్లో నోటి క్యాన్సర్పై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. కార్యక్రమంలో డీఐఓ డాక్టర్ శశిభూషణ్ రెడ్డి, ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ విష్ణుమూర్తి, శ్రీనివాసులు రెడ్డి, ఓబులు, డెమో నాగరాజు, ఎస్ఓ మహమ్మద్ రఫి పాల్గొన్నారు.
ర్యాలీని ప్రారంభిస్తున్న డీఎంహెచ్ఓ భ్రమరాంబ దేవి


