అంతర్జాతీయ మాస్టర్ అథ్లెటిక్స్కు ఎంపిక
గుంతకల్లుటౌన్: పట్టణంలోని ఎస్జేపీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఫిజికల్ డైరెక్టర్గా పనిచేస్తున్న జ్యోతి అంతర్జాతీయ మాస్టర్ అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికయ్యారు. ఈ నెల 2వ తేదీన రాజస్థాన్లోని జైపూర్లో జరిగిన జాతీయస్థాయి 7వ మాస్టర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ (40 సంవత్సరాల వయస్సు పైబడిన వారు) పోటీల్లో జ్యోతి 800 మీటర్ల పరుగు పందెం, ట్రిపుల్ జంప్లో ప్రతిభ కనబరిచి ద్వితీయస్థానంలో నిలిచినట్లు పాఠశాల హెచ్ఎం గోపాల్రెడ్డి, పీడీ ఎంకె.రాజేష్ తెలిపారు. శనివారం పాఠశాలలో ఏర్పాటు చేసిన సభలో గుంతకల్లు ఎంఈఓలు మస్తాన్రావు, సుబ్బరాయుడు, డీ.హీరేహాళ్ ఎంఈఓ వేణుగోపాల్లు పాల్గొని జ్యోతిని అభినందించారు.
అనుమానంతోనే హత్య
● వీడిన కావలి రమేష్ హత్య కేసు మిస్టరీ
బొమ్మనహాళ్: మండలంలోని లింగదహాళ్ గ్రామ శివారులో ఈ నెల 1న జరిగిన కావలి రమేష్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. రాయదుర్గం రూరల్ సీఐ వెంకటరమణ, బొమ్మనహాళ్ ఎస్ఐ నబీరసూల్ శనివారం సాయంత్రం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కావలి రమేష్ తన తల్లితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో మండలంలోని కొలగానహళ్లి గ్రామానికి చెందిన కావలి మహేంద్ర అతడిని హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. తన బంధువైన కావలి తిప్పేస్వామి అలియాస్ తిప్పయ్య, హరిజన సోమశేఖర్, కణేకల్లు మండలం కళేకుర్తి గ్రామానికి చెందిన బోయ రమేష్తో కలిసి కుట్ర పన్నాడు. ఈ నెల 1న సాయంత్రం కావలి రమేష్ లింగదహాళ్లోని ఎరువుల దుకాణానికి వెళ్తున్నాడని తెలుసుకుని మార్గమధ్యంలో కాపుకాసిన నలుగురూ.. వేటకొడవళ్లతో విచక్షణారహితంగా నరికి హతమార్చి పరారయ్యారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు శనివారం కణేకల్లు క్రాస్లోని ఆర్డీటీ ఆసుపత్రి ఎదురుగా నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. హత్యకు ఉపయోగించిన రెండు వేట కొడవళ్లు, ఒక ద్విచక్ర వాహనం, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ వెంకటరమణ తెలిపారు. కావలి రమేష్ను హత్య చేసేందుకు కిరాయి హంతకులను ఏర్పాటు చేస్తానని బోయ రమేష్ చెప్పగా హత్య సఫలమయ్యేందుకు హరిజన సోమశేఖర్ పూజలు చేయించి తాయెత్తు తెచ్చినట్లు వెల్లడైందన్నారు. కేసులో ఇంకా ఇద్దరిని అరెస్టు చేయాల్సి ఉందన్నారు. నిందితులను పట్టుకున్న పోలీసులను కళ్యాణదుర్గం డీఎస్పీ రవిబాబు అభినందించారు.
హంచనహాల్లో
దొంగల కలకలం
విడపనకల్లు: మండల పరిధిలోని హంచనహాల్ గ్రామంలో దొంగల కలకలం రేగింది. గ్రామస్తులు తెలిపిన మేరకు ... కర్నూలు జిల్లా తాండాకు చెందిన ఐదుగురు దొంగలు శనివారం రాత్రి 10 గంటల సమయంలో గ్రామంలోకి చొరబడ్డారు. వీరిని గుర్తించిన యువకులు, మహిళలు ప్రశ్నించగా పారిపోయేందుకు యత్నించారు. ఈ క్రమంలోనే గ్రామస్తులు వెంబడించి ఇద్దరిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. గ్రామంలో దొంగతనం చేసేందుకు వచ్చినట్లు వారు ఒప్పుకున్నట్లు తెలిసింది. సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని దొంగలను అదుపులోకి తీసుకున్నారు.
అంతర్జాతీయ మాస్టర్ అథ్లెటిక్స్కు ఎంపిక


