బాలుడి కిడ్నాప్ యత్నం... మహిళకు దేహశుద్ధి
గుంతకల్లు రూరల్: ఓ బాలుడిని కిడ్నాప్ చేసేందుకు యత్నించిన మహిళను స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. వివరాలు... గుంతకల్లులోని జగ్జీవన్రామ్ కాలనీకి చెందిన శ్రీనివాసులు, సుజాత దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. పైపుల ఫ్యాక్టరీలో శ్రీనివాసులు కూలి పనులకు వెళ్లేవాడు. సుజాత సైతం వ్యవసాయ కూలి పనులతో భర్తకు చేదుడుగా నిలిచింది. ఈ క్రమంలో శుక్రవారం దంపతులిద్దరూ పనిలోకి వెళ్లారు. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఇంటి బయట ఆడుకుంటున్న శ్రీనివాసులు కుమారుడు విఘ్నేష్ను అటుగా వచ్చిన ఓ మహిళ ఎత్తుకొని వెళ్లిపోయింది. ఆమె మొహాన్ని చూసి బిత్తర పోయిన బాలుడు బిగ్గరగా ఏడవడంతో కాలనీలోని ఓ మహిళ అడ్డుకుంది. సంకలో ఉన్న బాలుడిని గుర్తించి సమాచారం ఇవ్వడంతో తల్లిదండ్రులు పరుగులు పెడుతూ అక్కడకు చేరుకున్నారు. అప్పటికే కాలనీ వాసులందరూ అక్కడ పోగయ్యారు. వివరాలు ఆరా తీసేందుకు ప్రయత్నించా ఆగంతకురాలు పొంతన లేని సమాధానాలు ఇవ్వడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ దేహశుద్ధి చేశారు. దీంతో తనతో పాటు మరో ముగ్గురు ఆడవాళ్లు, ఇద్దరు మగవాళ్లు ఉన్నారని హిందీలో తెలిపింది. తాము ఎందుకోసం వచ్చారనే విషయాన్ని మాత్రం చెప్పలేదు. సమాచారం అందుకున్న రూరల్ పోలీసులు అక్కడకు చేరుకుని ఆగంతకురాలని పీఎస్కు తరలించారు.


