ప్రాణాన్ని బలిగొన్న కుటుంబ కలహాలు
వజ్రకరూరు: కుటుంబ కలహాలతో ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన మేరకు.. వజ్రకరూరుకు చెందిన ఆర్.రవికుమార్ (26) స్థానికంగా ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. ఇతనికి ఏడాదిన్నర కిందట గుంతకల్లుకు చెందిన జయశ్రీ అనే యువతితో వివాహమైంది. మూడు నెలలుగా భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తాయి. ఈ క్రమంలో భార్య పుట్టింటికి వెళ్లిపోవడం.. తిరిగి రావడం.. జరుగుతోంది. ఇరు కుటుంబాల పెద్దలు వీరి కాపురాన్ని చక్కదిద్దేందుకు ప్రయత్నాలు చేస్తున్న క్రమంలోనే మనస్తాపానికి గురైన రవికుమార్ ఆదివారం మధ్యాహ్నం ద్విచక్రవాహనంపై గ్రామ సమీపంలోని పొలంలోకి వెళ్లాడు. అక్కడి నుంచే సోదరుడికి, మిత్రుడికి ఫోన్ చేసి తాను చనిపోతున్నానని చెప్పి పెట్టేశాడు. అనంతరం వెంట తీసుకెళ్లిన పెట్రోలును ఒంటిపై పోసుకుని నిప్పంటించుకున్నాడు. రవికుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనలో ద్విచక్రవాహనం కూడా కాలిపోయింది. మృతుని తల్లి వరాలమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.


