బండారు శ్రావణిశ్రీ నివాసం వద్ద క్షుద్రపూజలు!
అనంతపురం సెంట్రల్: శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ నివాసం వద్ద క్షుద్రపూజలు చేశారన్న వదంతులు కలకలం రేపాయి. శనివారం ఉదయం అనంతపురంలోని నివాసం వద్ద జరిగిన ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. ఏపీ39 కేఎక్స్ 0986 నంబరు గల కారులో వచ్చిన వ్యక్తులు ఎమ్మెల్యే నివాసం దగ్గర నిమ్మకాయలు మంత్రించి పరారైనట్లు చెబుతున్నారు. ఆ సమయంలో గమనించిన ఎమ్మెల్యే అనుచరులు వారిని పట్టుకునేందుకు వెంబడించినా దొరకలేదని అంటున్నారు. ఈ పని ఎవరు చేశారు.. ఎందుకు చేశారు అనేది తేలాల్సి ఉంది. ఈ ఘటనపై ఎటువంటి ఫిర్యాదూ అందలేదని టూటౌన్ సీఐ శ్రీకాంత్యాదవ్ తెలిపారు.
రేపు ‘పరిష్కార వేదిక’
అనంతపురం అర్బన్: కలెక్టరేట్ రెవెన్యూ భవన్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. ఆ రోజు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించనున్న కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలను అర్జీ రూపంలో అధికారులకు సమర్పించాలని సూచించారు.
ఉచిత విద్యకు దరఖాస్తు చేసుకోండి
అనంతపురం ఎడ్యుకేషన్: విద్యా హక్కు చట్టం–2009 ఉచిత నిర్బంధ హక్కు చట్టం సెక్షన్ 12(1)సి ప్రకారం 2026–27 విద్యా సంవత్సరంలో ప్రైవేట్ పాఠశాలల్లో ఒకటో తరగతి ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ ప్రసాద్బాబు సూచించారు. ఈ మేరకు ఆయన శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న, బలహీన వర్గాల పిల్లలకు సమీప ప్రాంతాల్లోని ప్రైవేట్ పాఠశాలల్లో 25 శాతం సీట్లు కేటాయించనున్నట్లు తెలిపారు. ఐబీ, సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, స్టేట్ సిలబస్ అనుసరిస్తున్న పాఠశాలలన్నీ కచ్చితంగా అమలు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. విద్యార్థుల ఆధార్, ప్రాథమిక వివరాలతో వెబ్సైట్లో కేటాయిస్తారన్నారు. ఎంపికై న విద్యార్థుల జాబితా వివరాలను సంబంధిత పాఠశాలల్లో చూసుకోవచ్చని పేర్కొన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు గ్రామ సచివాలయం, మండల వనరుల కేంద్రం, సంబంధిత పాఠశాల నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. మరిన్ని వివరాలకు ఎంఈఓలను సంప్రదించాలన్నారు.
చిరుతల కోసం
డ్రోన్ కెమెరాతో నిఘా
శింగనమల: కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న చిరుతల కోసం అటవీ శాఖ అధికారులు గాలింపు ముమ్మరం చేశారు. బుక్కరాయసముద్రం మండలం సంజీవపురం – నార్పల మండలం బొందలవాడ పొలాల్లో చిరుతల సంచారం కలకలం రేపింది. వారం రోజులుగా ఎప్పుడు, ఎటువైపు నుంచి వచ్చి దాడి చేస్తుందోనని ఈ ప్రాంతాల ప్రజల భయంతో గజగజ వణికిపోతున్నారు. సమాచారం అందుకున్న జిల్లా ఫారెస్ట్ అధికారి చక్రపాణి ఆధ్వర్యంలో స్థానిక అధికారులు, సిబ్బంది పై రెండు గ్రామాల పొలాల్లో పర్యటించారు. చిరుత ఎప్పుడు కనిపించిందంటూ ఆయా ప్రాంత రైతులు, ప్రజల నుంచి వివరాలు ఆడిగి తెలుసుకున్నారు. చిరుత పాదాల గుర్తుల కోసం నిశితంగా పరిశీలిస్తున్నారు. చిరుతల ఆచూకీ కోసం పొలాల్లో డ్రోన్ కెమారాలతో నిఘా వేశారు. చిరుతలు కనిపిస్తే ఆ ప్రదేశంలో బోన్లు ఏర్పాటు చేయడానికి, తదితర చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుందని ఫారెస్ట్ అధికారులు అంటున్నారు. బుక్కరాయసముద్రం మండలం సంజీవపురం, బొమ్మలాటపల్లి, కేకే ఆగ్రహారం, బొందలవాడ, ఆ గ్రామాల పరిసరాల్లో చీనీ, మామిడి, మొక్కజొన్న, సపోట తోటలు ఆధికంగా ఉన్నాయి. చిరుతలు ఈ తోటలలో కనిపిస్తున్నాయని, అటువైపు పోవడానికి భయపడుతున్నామని రైతులు ఫారెస్ట్ అధికారులకు తెలిపారు. ఈగ్రామాల పరిధిలోని పొలాల్లో డ్రోన్ కెమెరాతో వాచ్ చేస్తున్నారు.
సంజీవపురం తోటల్లో చిరుత గుర్తింపు
ఫారెస్ట్ అధికారులు డ్రోన్ కెమారాతో పరిశీలించగా.. సంజీవపురం వద్ద వ్యవసాయ తోటల్లో ఒక చిరుత సంచరిస్తున్నట్లు గుర్తించారు. చిరుతను త్వరలోనే పట్టుకుంటామని, అందుకు అవసరమైన బోను కూడా ఏర్పాటు చేస్తున్నామని ఫారెస్ట్ అధికారులు తెలిపారు.
బండారు శ్రావణిశ్రీ నివాసం వద్ద క్షుద్రపూజలు!


