ఏపీపీఎస్సీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
అనంతపురం అర్బన్: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఆధ్వర్యంలో ఈ నెల 9 నుంచి జరగనున్న పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని ఏపీపీఎస్సీ చైర్మన్ శశిధర్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ ఆవరణలో పరీక్షల ప్రశ్నపత్రాలు, ఓఎంఆర్ షీట్లను భద్రపరిచిన ఖజానా స్ట్రాంగ్ రూమ్ను శనివారం ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నాలుగు కేంద్రాల్లో ఈ నెల 9 నుంచి 13వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. పరీక్షల ఏర్పాట్లు సంతృప్తికరంగా ఉన్నాయ న్నారు. రోజూ రెండు సేషన్లుగా ఉదయం 9.30కు, మధ్యాహ్నం 2.30 గంటలకు పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు. అభ్యర్థులు అరగంట ముందే కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. నిర్దేశించిన సమయం తరువాత కేంద్రాల్లోకి అనుమతి ఉండదన్నారు. అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డుతో పాటు ఏదేని గుర్తింపు కార్డును వెంట తెచ్చుకోవాలని చెప్పారు. సెల్ఫోన్లు, ఇతర ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులనూ కేంద్రాల్లోకి అనుమతించబోరని స్పష్టం చేశారు. కార్యక్రమంలో కలెక్టరేట్ పరిపాలనాధికారి అలెగ్జాండర్, ఏపీపీఎస్సీ సెక్షన్ అధికారులు శ్రీనివాస్, మల్లికార్జునరావు పాల్గొన్నారు.


