
2027 నాటికి మూడు రెట్లు వృద్ధి
టెక్నాలజీపై పెట్టుబడులు, డిజిటల్ వ్యవస్థ దన్ను
బీసీజీ తాజా నివేదికలో వెల్లడి
న్యూఢిల్లీ: దేశీ కృత్రిమ మేథ (ఏఐ) మార్కెట్ 2027 కల్లా ప్రస్తుత స్థాయి నుంచి మూడు రెట్లు వృద్ధి చెందనుంది. అంతర్జాతీయంగా అత్యంత వేగంగా ఎదుగుతున్న ఏఐ ఎకానమీల్లో ఒకటిగా భారత్ను నిలబెడుతూ 17 బిలియన్ డాలర్ల స్థాయికి చేరనుంది. ఎంటర్ప్రైజ్ టెక్నాలజీలో పెట్టుబడులు పెరుగుతుండటం, డిజిటల్ వ్యవస్థ వృద్ధి చెందుతుండటం, నిపుణులైన ప్రొఫెషనల్స్ లభ్యత తదితర అంశాలు ఇందుకు దోహదపడనున్నాయి.
బోస్టన్ కన్సలి్టంగ్ గ్రూప్ (బీసీజీ) రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం ప్రపంచ ఏఐ టాలెంట్లో 16 శాతం మంది భారత్లో ఉన్నారు. దేశీ ఏఐ వ్యవస్థలో 6,00,000 మంది పైగా ఏఐ ప్రొఫెషనల్స్, 70 కోట్ల మంది ఇంటర్నెట్ యూజర్లు ఉన్నారు. గత మూడేళ్లలో 2,000 పైగా ఏఐ స్టార్టప్లు ఏర్పాటయ్యాయి.
డిజిటల్ ఇన్ఫ్రా దన్ను..
ఆధార్, యూపీఐ, డిజిలాకర్, ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ఓఎన్డీసీ)లాంటి డిజిటల్ మౌలిక సదుపాయాలు దేశీయంగా వివిధ రంగాలను ఏఐతో అనుసంధానించేందుకు సహాయకరంగా ఉంటున్నాయి. పెద్ద సంఖ్యలో ఇంటర్నెట్ యూజర్లు, విస్తృతంగా స్మార్ట్ఫోన్ వినియోగం కారణంగా భారత్లో భారీ స్థాయిలో డేటా జనరేట్ కావడం ఏఐ మోడల్స్ శిక్షణకు ఉపయోగకరంగా ఉంటోంది. ఇక ప్రస్తుతమున్న 152 డేటా సెంటర్ల నెట్వర్క్కు అదనంగా 2025లో భారత్లో కొత్తగా 45 సెంటర్లు రానున్నాయి.
రూ. 10,000 కోట్లతో ప్రభుత్వం ప్రకటించిన ఇండియాఏఐ మిషన్ జాతీయ స్థాయిలో ఏఐ కంప్యూట్ మౌలిక సదుపాయాల కల్పనకు దోహదపడనుంది. దీనితో ఏఐ మోడల్ శిక్షణ, పరిశోధన కోసం 10,000 పైగా జీపీయూలు (గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్లు) అందుబాటులోకి వస్తాయి. ‘ఏఐ అనేది వ్యాపార సంస్థలకు ఒక ఆప్షన్గా కాకుండా అవసరంగా మారింది. భారతీయ కంపెనీలు అంతర్జాతీయంగా కూడా మరింత ధీమాగా పోటీపడగలుగుతున్నాయి. టెక్నాలజీ వినియోగం మాత్రమే కాకుండా మార్పులను సమర్ధవంతంగా ఎదుర్కొనడం, అంతర్గత వ్యవస్థలో ఏఐని వినియోగించుకోవడం వంటి అంశాలే అగ్రగామి కంపెనీలకు మిగతా సంస్థలకు మధ్య వ్యత్యాసాన్ని నిర్దేశిస్తాయని బీసీజీ ఇండియా ఎండీ మన్దీప్ కోహ్లి తెలిపారు.