డేటా సెంటర్ల బూమ్‌..  | Indian Data Centre Sector to See 25Billion dollers Investment by 2030 | Sakshi
Sakshi News home page

డేటా సెంటర్ల బూమ్‌.. 

Jun 1 2025 12:36 AM | Updated on Jun 1 2025 12:36 AM

Indian Data Centre Sector to See 25Billion dollers Investment by 2030

ఆరేళ్లలో 25 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు

మూడు రెట్లు పెరగనున్న సామర్థ్యాలు 

రియల్‌ ఎస్టేట్‌కి కూడా దన్ను

న్యూఢిల్లీ: దేశీ డేటా సెంటర్‌ (డీసీ) పరిశ్రమ భారీగా విస్తరిస్తోంది. వచ్చే అయిదారేళ్లలో కొత్తగా 20–25 బిలియన్‌ డాలర్ల మేర పెట్టుబడులను ఆకర్షించనుంది. దీనితో సెంటర్ల ఏర్పాటు కోసం వినియోగించే రియల్‌ ఎస్టేట్‌ కూడా మూడు రెట్లు పెరగనుంది. ప్రస్తుతం 15.9 మిలియన్‌ చ.అ.లుగా ఉన్న స్పేస్‌ 2030 నాటికి 55 మిలియన్‌ చ.అ.లకు చేరనుంది. రియల్‌ ఎస్టేట్‌ కన్సల్టింగ్‌ సంస్థ కొలియర్స్‌ ఇండియా ఒక నివేదికలో ఈ విషయాలు వెల్లడించింది.

 క్లౌడ్‌ కంప్యూటింగ్, ఏఐ, ఐవోటీ వినియోగం పెరుగుతుండటం, వివిధ రంగాల వ్యాప్తంగా డిజిటలీకరణ వేగవంతం అవుతుండటం తదితర అంశాల దన్నుతో డేటా సెంటర్ల మొత్తం సామర్థ్యాలు మూడు రెట్లు పెరిగి 2030 నాటికి 4.5 గిగావాట్లకు చేరనున్నాయి. 2018లో 307మెగావాట్లుగా ఉన్న డీసీల సామర్థ్యం ఈ ఏడాది ఏప్రిల్‌ నాటికి, అంటే కేవలం ఏడేళ్ల వ్యవధిలో సుమారు నాలుగు రెట్లు పెరిగి 1.26  గిగావాట్లకు చేరింది. 

పరివర్తన దశలో పరిశ్రమ.. 
ప్రస్తుతం పరిశ్రమ పరివర్తన దశలో ఉందని నిపుణులు తెలిపారు. మెట్రో నగరాల్లోనే కాకుండా ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలకు కూడా విస్తరిస్తోందని వివరించారు. డీసీల విషయంలో ముంబై, చెన్నైల ఆధిపత్యం ఉంటోంది. మొత్తం సామర్థ్యాల్లో మూడింట రెండొంతుల వాటా వీటిదే ఉంటోంది. అత్యధికంగా 41 శాతం వాటాతో ముంబై అగ్రస్థానంలో, 23 శాతంతో చెన్నై రెండో స్థానంలో, 14 శాతం వాటాతో ఢిల్లీ ఎన్‌సీఆర్‌ మూడో స్థానంలో ఉన్నాయి. 

ఈ మూడు మార్కెట్లు కలిసి గత 6–7 ఏళ్లలో డేటా సెంటర్‌ రియల్‌ ఎస్టేట్‌ మూడు రెట్లు పెరిగేందుకు దోహదపడ్డాయి. ‘‘తక్కువ లేటెన్సీ, రియల్‌ టైమ్‌ అనాలిసిస్, మెరుగైన యాప్‌ల పనితీరు, వివిధ పరిస్థితులకు అనుగుణంగా వ్యాపారాలు తమను తాము మల్చుకోవాల్సి వస్తుండటం తదితర అవసరాలరీత్యా డేటా సెంటర్లు భారీగా విస్తరిస్తున్నాయి’’ అని కొలియర్స్‌ ఇండియా వెల్లడించింది. 

2030 నాటికి డీసీల కెపాసిటీ 4.5 గిగావాట్లకు ఎగియడానికి కూడా ఇదే దోహదపడుతుందని పేర్కొంది. పునరుత్పాదక విద్యుత్, 3 గిగావాట్ల విద్యుత్‌ మిగులులాంటివి చౌకగా హోస్టింగ్‌ సేవలు అందించడంలో భారత్‌కు సానుకూలాంశాలని క్యాపిటలాండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ వర్గాలు తెలిపాయి. అతి కొద్ది దేశాలకు మాత్రమే ఈ ప్రయోజనం ఉంటుందని వివరించాయి. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ముంబైలో తలో డేటా సెంటర్‌ ఏర్పాటు కోసం క్యాపిటలాండ్‌ మొత్తం మీద 1.15 బిలియన్‌ సింగపూర్‌ డాలర్లను ఇన్వెస్ట్‌ చేస్తోంది.   

2020 నుంచి పెట్టుబడుల ప్రవాహం.. 
భారత డిజిటల్‌ మౌలిక సదుపాయాలపై ఇన్వెస్టర్లకు పెరుగుతున్న నమ్మకానికి నిదర్శనంగా భారీగా పెట్టుబడులు తరలి వస్తున్నాయి. 2020 నుంచి 14.7 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు రాగా 2030 నాటికి మరో 20–25 బిలియన్‌ డాలర్లు రావచ్చనే అంచనాలు నెలకొన్నాయి. తక్కువ లేటెన్సీ, అత్యుత్తమ పనితీరు కోసం ఓటీటీ ప్లాట్‌ఫాంలు, కంటెంట్‌ డెలివరీ నెట్‌వర్క్‌ (సీడీఎన్‌) సేవల సంస్థల నుంచి డిమాండ్‌ నెలకొన్నట్లు నె్రక్ట్‌సా బై ఎయిర్‌టెల్‌ సీఈవో ఆశీశ్‌ ఆరోరా తెలిపారు. 

ఈ సంస్థ 65 పైగా నగరాల్లో 120 ఎడ్జ్‌ డేటా సెంటర్లు, 14 హైపర్‌స్కేల్‌ డేటా సెంటర్లను నిర్వహిస్తోంది. తాము ప్రాంతీయంగా చిన్న పట్టణాల్లోకి కూడా విస్తరించడంపై దృష్టి పెడుతున్నామని ఆరోరా వివరించారు. విజయవాడ, అగర్తలా, పాటా్న, గువాహటి, సంబల్‌పూర్, గంగాగంజ్‌లాంటి కీలక నగరాల్లో తమ ఎడ్జ్‌ సెంటర్లను విస్తరించినట్లు వివరించారు.
 
వీటితో మెట్రోల వెలుపల తృతీయ శ్రేణి నగరాల్లోని యూజర్లకు కూడా డిజిటల్‌ మౌలిక సదుపాయాలు మరింతగా అందుబాటులోకి వస్తున్నాయని, లైవ్‌.. హై–డెఫినిషన్‌ స్ట్రీమింగ్‌కి సంబంధించి లేటెన్సీ.. బ్యాండ్‌విడ్త్‌ వ్యయాలు తగ్గుతున్నాయని పేర్కొన్నారు. డీసీల విభాగంలో కొత్త పరిణామాలు చూస్తే అదానీకనెక్స్‌ సంస్థ చెన్నైలో 100 మెగావాట్ల క్యాంపస్‌ను, నోయిడాలో 50 మెగావాట్ల సెంటర్‌ను ఏర్పాటు చేస్తోంది. 

మరిన్ని ద్వితీయ శ్రేణి పట్టణాల్లోనూ ఏర్పాటు చేసే ప్రణాళికల్లో ఉంది.  ఇప్పటికే గ్రేటర్‌ నోయిడాలో ఉన్న యోటా డీ1తో పాటు హైపర్‌స్కేల్‌ క్యాంపస్‌ల విస్తరణపై యోటా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ రూ. 39,000 కోట్లు ఇన్వెస్ట్‌ చేయనుంది. క్యాపిటల్యాండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ తమ నవీ ముంబై సెంటర్‌పై రూ. 1,940 కోట్ల పెట్టుబడులు ప్రకటించింది. ఎస్‌టీటీ జీడీసీ ఇండియా, ఎన్‌టీటీ గ్లోబల్‌ తదితర సంస్థలు హైదరాబాద్, చెన్నై, పుణె, బెంగళూరు నగరాల్లో కొత్త హైపర్‌స్కేల్‌ సెంటర్స్‌తో కార్యకలాపాలను 
విస్తరిస్తున్నాయి.

హైదరాబాద్, ముంబై సారథ్యం.. 
2020 నుంచి ఈ ఏడాది ఏప్రిల్‌ మధ్యకాలంలో భారత్‌లో కొత్తగా 859 మెగావాట్ల డీసీ సామర్థ్యాలు జతయ్యాయి. ఇందులో ముంబై వాటా 44 శాతంగా, చైన్నై, ఢిల్లీ ఎన్‌సీఆర్‌ వాటా సంయుక్తంగా 42 శాతంగా ఉంది. 2023 నుంచి అయిదేళ్ల వ్యవధిలో కొత్తగా 3 – 3.7 గిగావాట్ల కొత్త సామర్థ్యాలు జత కానున్నాయి. చెరి 1–1.2 గిగావాట్ల సామర్థ్యాలతో హైదరాబాద్, ముంబై ఇందుకు సారథ్యం వహించనున్నాయి. హైదరాబాద్‌ వర్ధమాన హైపర్‌స్కేల్‌ హబ్‌గా ఎదుగుతోంది. పుణె 300–450 మెగావాట్లు, చెన్నై 400–450 మెగావాట్ల కొత్తగా సామర్థ్యాలను జతపర్చుకోనున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement