ఒక్కమాటే..మంత్రము | Indian artificial intelligence startups are working to improve voice interaction | Sakshi
Sakshi News home page

ఒక్కమాటే..మంత్రము

Jun 19 2025 4:51 AM | Updated on Jun 19 2025 4:51 AM

Indian artificial intelligence startups are working to improve voice interaction

వాయిస్‌ కమాండ్‌తో అన్నీ చకచకా

భారతీయ భాషలన్నీ అర్థం చేసుకునేలా..

కేంద్ర ప్రభుత్వ ‘ఇండియా ఏఐ మిషన్‌’

వాయిస్‌ ఏఐ మోడళ్ల తయారీ

5 ఏళ్లలో రూ.10వేల కోట్ల వ్యయం

మనం ఆన్‌లైన్లో ఏదైనా కొనాలన్నా.. ఆహారం ఆర్డర్‌ చేయాలన్నా.. బైక్‌/కారు బుక్‌ చేయాలన్నా.. ఏ భాషలోనైనా సమాచారం కావాలన్నా.. ఇకమీదట ఫోన్లో టైప్‌ చేయాల్సిన అవసరం ఉండకపోవచ్చు. నేరుగా ఏం కావాలో ‘మాట’ మాత్రంగా  చెప్తే చాలు.. పని జరిగిపోతుంది. 

దేశంలోని అన్ని భాషలనూ అర్థం చేసుకుని, ఆయా భాషల్లో సేవలు అందించే ‘వాయిస్‌ ఏఐ’ రోజులు వస్తున్నాయి. ఇందుకోసం భారత ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించిన ‘ఇండియా ఏఐ మిషన్‌’ జోరందుకుంది. రోజువారీ పనులను చక్కబెట్టుకోడానికీ ‘వాయిస్‌ ఏఐ’ అనే కృత్రిమ మేధ మనకోసం ‘కార్యేషు కమాండర్‌’లా సిద్ధం కాబోతోంది. – సాక్షి, స్పెషల్‌ డెస్క్‌

దేశంలో ప్రస్తుతం ఉన్న 90 కోట్ల మంది ఇంటర్‌నెట్‌ వినియోగదారులు ఉన్నారు. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలు, గ్రామాల్లో.. ఇంగ్లీష్‌ వ్యాప్తి తక్కువగా ఉంటుంది. డిజిటల్‌ అక్షరాస్యత ఇప్పుడిప్పుడే విస్తరిస్తోంది. ఈ ప్రాంతాల్లోని వారు వాయిస్‌ కమ్యూనికేషన్‌ ద్వారా తమ పనులు చక్కబెట్టేందుకు ఇష్టపడుతున్నారు. ఇలా టెక్స్‌›్టను టైప్‌ చేయటానికి ఇష్టపడని, లేదా టైప్‌ చేయటం రాని వారి కోసం ఒక సరళమైన, స్పష్టమైన ‘వాయిస్‌ ఇంటరాక్షన్‌’ విధానాన్ని వృద్ధి చేసేందుకు భారతీయ కృత్రిమ మేధ (ఏఐ) స్టార్టప్‌ కంపెనీలు కృషి చేస్తున్నాయి.

చెబితే చాలు... చేసి పెడుతుంది!
రైతులు, గ్రామీణ వ్యాపారులు, గిగ్‌ వర్కర్‌లు, గృహిణులు సహా ఆన్‌లైన్‌ వినియోగదారులందరూ ఈ వాయిస్‌ ఎఐతో ఇంటర్నెట్‌ వాడకం స్వరూపాన్నే మార్చేయబోతున్నారని భారతీయ వాయిస్‌ ఏఐ స్టార్టప్‌ కంపెనీలు చెబుతున్నాయి. రైతులు ఇప్పటికే తమ ఫోన్‌లో ఒక్క మాట కూడా చదవకుండానే, ఒక్క బటన్‌ కూడా నొక్కకుండానే పంటల బీమా, క్రెడిట్‌ అర్హత, వాతావరణ పరిస్థితులకు తట్టుకునే వ్యవసాయ విధానాల సమాచారం తెలుసుకుంటున్నారు.  జ్ఞాని.ఏఐ ప్రయోగాత్మకంగా ఇటీవలే దేశంలోని 120 గ్రామాలలో 15 వేల కంటే ఎక్కువ మంది రైతులకు ఈ విధానంలో సమాచారాన్ని అందించింది. ఒక బాట్‌ (సాఫ్ట్‌వేర్‌ అప్లికేషన్‌) ద్వారా వారికి 3 నిమిషాల వాయిస్‌ కాల్‌ వచ్చింది. ఇది వాళ్ల స్థానిక భాష, యాసలోనే వాళ్లకు కావాల్సిన సూచనలూ, సలహాలూ అందించడం విశేషం.

నాలుగు కంపెనీల ఎంపిక
‘ఇండియా ఏఐ మిషన్‌’ కింద భారత ప్రభుత్వం రూ.10,372 కోట్ల పంచ వర్ష బడ్జెట్‌ కేటాయింపులతో ‘సర్వమ్‌’, సోకెట్‌ ల్యాబ్స్, జ్ఞాని.ఏఐ, గాన్‌.ఏఐ అనే నాలుగు స్టార్టప్‌ కంపెనీలను ఎంపిక చేసింది. ప్రాథమిక వాయిస్‌ ఏఐ మోడళ్లను, అత్యాధునిక లార్జ్‌ లాంగ్వేజ్‌ మోడల్స్‌ (ఎల్‌ఎల్‌ఎమ్‌) తయారుచేసే బృహత్తర బాధ్యతలను వీరికి అప్పగించింది. ‘సర్వమ్‌’ ఏఐ.. 10 భారతీయ భాషల్లో శిక్షణ పొందిన వ్యవస్థను రూపొందించింది. 

ఇది గణితం, కోడింగ్, బహుభాషా అవగాహన వంటి అనేక ప్రక్రియలను సులభంగా చేయగలదు. జ్ఞాని.ఏఐ 12 భారతీయ భాషలు సహా మొత్తం 40 ప్రపంచ భాషలను గుర్తించి సేవలు అందిస్తుంది. సోకెట్‌ ల్యాబ్స్‌ భారతీయ భాషలకు అనుగుణంగా ‘ప్రజ్ఞ–1బి’ అనే ప్రాథమికమైన ఏఐ మోడల్‌ని (ఓపెన్‌ ఏఐ, చాట్‌ జీపీటీ మాదిరిగా) రూపొందించింది. గాన్‌.ఏఐ అనేది ఇన్‌స్టంట్‌ ఏఐ వీడియోలు తయారుచేస్తుంది.

‘భారత్‌లోనే తయారవ్వాలి – భారతదేశ అభివృద్ధికే పనిచేయాలి.. ఇదే ఇండియా ఏఐ మిషన్‌ ప్రధాన ఉద్దేశం’ అని కంపెనీల ఎంపిక సందర్భంగా కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ స్పష్టం చేశారు. 

‘స్వదేశీ వాయిస్‌’ సవాళ్లు!
భారతీయ స్టార్టప్‌లు నేటికీ పాశ్చాత్య డేటాసెట్‌లపై శిక్షణ పొందిన ఓపెన్‌ ఏఐ, డీప్‌గ్రామ్‌ వంటి నమూనాలపైనే ఎక్కువగా ఆధారపడుతున్నాయి. ఇవి భారతీయ భాషలు, అందులోని యాసలు, పేర్లు లేదా స్థానిక సూక్ష్మాంశాలను తరచుగా తప్పుగా అర్థం చేసుకుంటున్నాయి. ఈ అంతరాన్ని తగ్గించడానికి, అందుకు అవసరమైన సాంకేతికను సాధించేందుకే కేంద్రం ‘ఇండియా ఏఐ మిషన్‌’కు శ్రీకారం చుట్టింది.

భవిష్యత్తంతా మాటలదే..!
గూగుల్‌ నివేదిక ప్రకారం స్మార్ట్‌ ఫోన్‌ వాడేవారిలో 60 శాతం భారతీయులు వాయిస్‌ అసిస్టెంట్‌ల ద్వారా సంభాషిస్తున్నారు. ‘వాట్‌ కన్సల్ట్‌’ నివేదిక ప్రకారం నెట్‌ సేవల్ని పొందే భారతీయుల్లో 76 శాతం మందికి స్పీచ్, వాయిస్‌ రికగ్నిషన్‌ టెక్నాలజీపై  అవగాహన ఉంది. 

దీన్ని బట్టి, మాతృభాషలో స్మార్ట్‌ఫోన్‌తో మాట కలిపి దైనందిన పనుల్ని చక్కబెట్టుకునే అలవాటు దేశ ప్రజల్లో ఎంతలా విస్తరించిందో అర్థం చేసుకోవచ్చు. ఆంగ్ల భాష లేదా ఇతర భాషలలో ఉండే ఆప్షన్‌లను ఫోన్‌లో చేతి వేళ్లతో నొక్కటం ద్వారా ముందుకు సాగే ‘గ్రాఫికల్‌ యూజర్‌ ఇంటర్ఫేస్‌’ (జి.యు.ఐ.) విధానానికి ఉన్న పరిమితులకు పరిష్కారంగా వచ్చిన ఈ ‘వాయిస్‌ ఏఐ’దే భవిష్యత్తంతా అని నిపుణులు అంటున్నారు.

2022లో మొత్తం ఏఐ స్టార్టప్‌లలో 702 మిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెడితే.. అందులో సుమారు 437 మిలియన్‌ డాలర్లు సంభాషణాపరమైన / వాయిస్‌ ఏఐ స్టార్టప్‌లలో పెట్టారు.

ఎవరెవరు ఏమేం చేస్తారంటే..
కొత్తగా తయారుచేయబోయే ఈ ఏఐ మోడళ్ల స్థాయిని వాటిలో ఉండే పారా మీటర్ల ఆధారంగా అంచనా వేస్తారు. ఎన్ని ఎక్కువ పారామీటర్లు ఉంటే అంత శక్తిమంతమైన మోడల్‌ అన్నమాట. 

సర్వమ్‌ ఏఐ రూపొందించిన సర్వమ్‌: ఎమ్, 2,400 కోట్ల పారామీటర్లు ఉండే మోడల్‌. ఇది భారతీయ భాషలన్నింటిలోనూ శిక్షణ పొందింది. స్టార్టప్‌లకు చేయూత నివ్వడం, సీసీటీవీ కెమెరాల్లాంటి భారతదేశంలో తయారయ్యే ఏఐ హార్డ్‌వేర్‌ వంటి వాటిని ప్రోత్సహించడం వంటి అదనపు బాధ్యతలు దీనికి అప్పగించింది ప్రభుత్వం. 

సోకెట్‌ ఏఐ: ఇది భారత దేశ మొట్ట మొదటి ఓపెన్‌ సోర్స్‌ ఏఐ మోడల్‌ను తయారుచేస్తుంది. 12,000 కోట్ల పారామీటర్లతో అనేక భారతీయ భాషల్లో పనిచేసే దీన్ని ఆరోగ్య సంర క్షణ, విద్య, రక్షణ రంగాల్లో వాడతారు. 

జ్ఞాన్‌ ఏఐ: 1,400 కోట్ల పారామీటర్లతో రూపొందించే ఈ వాయిస్‌ మోడల్‌ వివిధ భారతీయ భాషలను అర్థం చేసుకోగలదు. రియల్‌ టైమ్‌లో కూడాస్పందించగలదు. కేవలం మాటలతోనే స్మార్ట్‌ఫోన్లో పనులు చేయాలనుకునేవారి కోసం స్మార్ట్‌ వాయిస్‌ అసిస్టెంట్లు, టూల్స్‌ను ఇది తయారుచేస్తుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement