
నిపుణులు, పెట్టుబడుల కొరతతో ఇబ్బందులు
చిన్న నగరాల్లో హైస్పీడ్ ఇంటర్నెట్ వంటి సదుపాయాల కొరత
డేటానే కీలకం కావటంతో సవాళ్లు విసురుతున్న సైబర్ నేరాలు
ఉపాధిపై దెబ్బ, సామాజిక అసమానతలపై ఆందోళన
సాక్షి, హైదరాబాద్: కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతిక అభివృద్ధిలో దూసుకుపోతున్న తెలంగాణలో.. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ సరికొత్త టెక్నాలజీని అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తోంది. ఏఐ సిటీ నిర్మాణం, బిగ్డేటా, సైబర్ సెక్యూరిటీ వంటి టెక్నాలజీలకు ప్రభుత్వం ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేసింది. డేటా సైన్స్, నైపుణ్యం, పాలన, పరిశోధన, భాగస్వామ్యం, అనుసరణ అనే ఆరు అంశాలను మూల స్తంభాలుగా చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం ఏఐ పాలసీని రూపొందించింది. అదే సమయంలో ఈ రంగంలో అనేక సవాళ్లు కూడా ఎదురవుతున్నాయి.
నిపుణుల కొరత..
డేటా సైన్స్, మెషీన్ లెర్నింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, బిగ్ డేటా అనలిటిక్స్ వంటి రంగాలలో రాష్ట్రంలో నిపుణుల కొరత తీవ్రంగా ఉంది. దీంతో ఏఐ ప్రాజెక్టుల అమల్లో ఆలస్యంతోపాటు అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలతో పోటీ పడలేకపోతున్నామని రాష్ట్ర ఐటీ వర్గాలు చెబుతున్నాయి.
ఏఐ అభివృద్ధిలో కీలకమైన అధిక కంప్యూటింగ్ శక్తి, హై–స్పీడ్ ఇంటర్నెట్, డేటా సెంటర్లు ద్వితీయ శ్రేణి నగరాల్లో అంతగా అభివృద్ధి చెందలేదు. దీంతో ఏఐ ఆవిష్కరణలు హైదరాబాద్కే పరిమితమవుతున్నాయి. ఏఐ వ్యవస్థలు పెద్ద ఎత్తున డేటాపై ఆధారపడుతుండటంతో గోప్యత, భద్రత అత్యంత కీలకంగా మారింది. డేటా ఉల్లంఘనలు, సైబర్ నేరాలు కూడా ఏఐ ఆచరణలో ప్రధాన సవాలుగా నిలుస్తున్నాయి.
ఎగుమతులు, ఉపాధి కల్పన నేలచూపులు
కొన్నేళ్లుగా రాష్ట్రంలో ఐటీ ఎగుమతులు, ఈ రంగంలో కొత్త ఉద్యోగాల కల్పన వృద్ధిలో గణనీయమైన తగ్గుదల కనిపిస్తోంది. 2022–23లో ఐటీ ఎగుమతుల్లో రూ.57,706 కోట్ల పెరుగుదల నమోదు కాగా.. 2023–24లో రూ.26,948 కోట్ల పెరుగుదల మాత్రమే ఉన్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
2022–23లో ఐటీ రంగంలో కొత్తగా 1,27,594 ఉద్యోగాల కల్పన జరగ్గా, 2023–24లో 40,285కి పడిపోయాయి. ఈ తగ్గుదల ఏఐ సహా ఐటీ రంగంలో కొత్త పెట్టుబడులను ఆకర్షించడంలో ఆటంకాలు సృష్టించిందనే వాదన వినిపిస్తోంది. ఏఐ ద్వారా ఆటోమేషన్ పెరిగి సంప్రదాయ ఉద్యోగాలు కోల్పోతామనే భయం ఐటీ ఉద్యోగుల్లో కనిపిస్తోంది.
స్టార్టప్లు, ఆవిష్కరణలే కీలకం
రాష్ట్రంలో రిజిస్టర్ చేసుకున్న స్టార్టప్ల (6,873)లో సుమారు మూడు శాతం ఏఐ, ఎంఎల్ ఆధారిత స్టార్టప్లు (211) ఉన్నాయి. తెలంగాణ ఏఐ మిషన్ (టీ ఎయిమ్) ద్వారా 142 ఏఐ స్టార్టప్లకు మార్కెట్తో అనుసంధానం, ఆర్థిక సాయం, మార్గదర్శనం, అత్యాధునిక ఏఐ కంప్యూటింగ్ సౌకర్యాలను ప్రభుత్వం అందిస్తోంది. 2027 నాటికి 5 లక్షల మందికి (18–45 ఏళ్ల వయస్సు) ఏఐ నైపుణ్యాల్లో శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.నాస్కామ్, మైక్రోసాఫ్ట్ తదితర సంస్థలతో కలిసి ఏటా 30 వేల మంది విద్యార్థులకు ఏఐ శిక్షణ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది.
ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఏఐని పాఠ్యాంశంగా చేర్చే ప్రణాళిక రూపొందిస్తోంది. ఎంఎస్ఎంఈలు, స్టార్టప్లకు ఏఐ కంప్యూటింగ్ సామర్థ్యాన్ని అందుబాటులోకి తేవడం, 12 భారతీయ భాషల్లో ఏఐ అప్లికేషన్ల అభివృద్ధి, ప్రభుత్వ సేవల్లో ఏఐ సాంకేతిక వినియోగాన్ని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 2024లో తెలంగాణ ఐటీ ఎగుమతులు రూ.2.68 లక్షల కోట్లు కాగా, 2025లో ఇందులో ఏఐ రంగం వాటాను 5 బిలియన్ డాలర్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది.
పెట్టుబడులు పెరిగితేనే ఫలితాలు
మనకు విస్తృతమైన ఇంజనీరింగ్ ప్రతిభా సంపద ఉన్నప్పటికీ డేటాసైన్స్, మెషీన్ లెరి్నంగ్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీలో కీలక నైపుణ్యాల కొరతను ఎదుర్కొంటున్నాం. ద్వితీయ శ్రేణి నగరాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు లేకపోతే మనం ఏఐ ఫలితాలను అందుకోలేం.
స్థానిక భాషలు, సంస్కృతి, స్థానిక అవసరాలకు అనుగుణంగా స్వదేశీ లార్జ్ లాంగ్వేజ్ మోడళ్లు (ఎల్ఎల్ఎం)లు, జనరేటివ్ ఏఐ మోడళ్లను అభివృద్ధి చేయడంలో కూడా మనం వెనుకబడి ఉన్నాం. ఏఐ వాతావరణం హైదరాబాద్ లాంటి నగరాలకే పరిమితం కాకుండా ఇంకా విస్తరించాలి. ఏఐ విప్లవాన్ని మన సొంత రీతిలో మనమే నిర్వచించుకోవాలి. – కరుణ్ తాడేపల్లి, కో ఫౌండర్, సీఈఓ–బైట్ఎక్స్ఎల్
ఏఐతో ఉద్యోగాలకు ముప్పు లేదు
ఏఐ వల్ల సంప్రదాయ ఉద్యోగాలకు ముప్పు ఉండదు. నెమ్మదిగా, పునరావృతమయ్యే పనులను వేగంగా పూర్తి చేసేందుకు ఏఐ సాంకేతికత ఉపయోగపడుతుంది. ఏఐ విప్లవానికి నాయకత్వం వహించే సామర్థ్యం మనకు ఉంది. కానీ ఏఐ, డేటా సైన్స్, క్లౌడ్లో నిపుణుల కొరతను ఎదుర్కొంటున్నాం.
ఇది రాత్రికి రాత్రే పరిష్కారమయ్యే సమస్య కాదు. నైపుణ్య శిక్షణ, ఆచరణాత్మక విధానాలు, నిరంతర పెట్టుబడులతోనే ఈ సమస్యను అధిగమించగలం. ఏఐ సాంకేతికతను అందిపుచ్చుకునేందుకు మాత్రమే ద్వితీయ శ్రేణి పట్టణాలు పరిమితం కాకుండా ఏఐ విప్లవంలో భాగస్వాములు కావాలి. – అంజి మరం, ఫౌండర్, సీఈఓ, క్రిటికల్రివర్ ఇంక్