డిజిటల్‌ ఎకానమీలో భారత్‌ పవర్‌హౌస్‌! | India Has Emerged As A Digital Powerhouse: Google India Head Preeti Lobana | Sakshi
Sakshi News home page

డిజిటల్‌ ఎకానమీలో భారత్‌ పవర్‌హౌస్‌!

Jun 18 2025 1:08 AM | Updated on Jun 18 2025 1:08 AM

India Has Emerged As A Digital Powerhouse: Google India Head Preeti Lobana

గూగుల్‌ ఇండియా హెడ్‌ ప్రీతి లోబానా

న్యూఢిల్లీ: డిజిటల్‌ ఎకానమీ వృద్ధి పరుగులు తీస్తుండటంతో భారత్‌ తిరుగులేని శక్తి (పవర్‌హౌస్‌)గా ఆవిర్భవించిందని గూగుల్‌ ఇండియా కంట్రీ మేనేజర్, వైస్‌ ప్రెసిడెంట్‌ ప్రీతి లోబానా పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) యుగంలో సుస్థిర ప్రగతికి భద్రత, విశ్వసనీయత అత్యంత కీలకమని, వీటిపై మరింతగా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఆమె స్పష్టం చేశారు. టెక్‌ దిగ్గజం గూగుల్‌ ఇండియా హెడ్‌గా ఇటీవలే ఎంపికైన ప్రీతి.. ఏఐ రంగంలో భారత్‌ శరవేగంగా పురోగమిస్తున్న నేపథ్యంలో గూగుల్‌ భద్రతా చార్టర్‌ను మంగళవారమిక్కడ ఆవిష్కరించారు.

ఆన్‌లైన్‌ మోసాలు, స్కామ్‌ల నుంచి యూజర్లకు రక్షణ కల్పించడం.. ప్రభుత్వం, కంపెనీలకు సైబర్‌ సెక్యూరిటీ, బాధ్యతాయుతమైన ఏఐ అభివృద్ధి వంటి అంశాల్లో సవాళ్లను కలిసికట్టుగా ఎదుర్కొనేందుకు ఈ చార్టర్‌ ఒక బ్లూప్రింట్‌గా నిలుస్తుందని గూగుల్‌ చెబుతోంది. ఈ సందర్భంగా పలు అంశాలపై ప్రీతి తన అభిప్రాయాలను వెల్లడించారు. ఆండ్రాయిడ్, ప్లేస్టోర్‌ విషయానికొస్తే మరింత మెరుగైన, వృద్ధిదాయకమైన డిజిటల్‌ ఎకోసిస్టమ్‌ను రూపొందించేందుకు గూగుల్‌ పూర్తిగా కట్టుబడి ఉందన్నారు. 

 కాగా, గుత్తాధిపత్యానికి సంబంధించి భారత్‌లో గూగుల్‌పై కేసుల గురించి మాట్లాడుతూ.. గూగుల్‌ ఏ దేశంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నా.. అక్కడి స్థానిక చట్టాలకు కట్టుబడి ఉంటుందని చెప్పారు. ఇందుకోసం ప్రభుత్వం, నియంత్రణ సంస్థలతో నిరంతరం కలిసి పనిచేస్తామని ఆమె తేల్చిచెప్పారు.

కొత్త టెక్నాలజీతో సవాళ్లు...
ఏఐ వంటి కొత్త టెక్నాలజీలు సృజనాత్మక సామర్థ్యాలను వెలికితీస్తున్నాయని.. అయితే, వాటివల్ల డీప్‌ఫేక్స్‌ వంటి సవాళ్లు కూడా పుట్టుకొస్తున్నాయని ప్రీతి అంగీకరించారు. ‘అందుకే మా ఏఐ సాంకేతికతను ఉపయోగించి రూపొందించే ఏ కంటెంట్‌లో అయినా వాటర్‌మార్క్‌లు ఉండేలా చూసేందుకు మేము ప్రయత్నిస్తున్నాం. దీనివల్ల యూజర్‌లు ఈ కంటెంట్‌లో దేనినైనా అప్‌లోడ్‌ చేస్తే, వాటిలోని ‘సింథ్‌ఐడీ’ని ఆయా షేరింగ్‌ టూల్స్‌ గుర్తించగలుగుతాయి’ అని వివరించారు. ఏఐ ఆధారిత తప్పుడు సమాచారాన్ని, డీప్‌ఫేక్స్‌ సవాళ్లను ఎదుర్కోవాలంటే పరిశ్రమవ్యాప్తంగా సహకారం అవసరమన్నారు. గూగుల్‌ సహా ఇతర కంపెనీలన్నీ ఈ కీలక అంశంపై దృష్టి సారిస్తున్నాయని చెప్పారు.

యూపీఐ.. అద్భుతం
భారత్‌లో డిజిటల్‌ ఆర్థిక స్వరూపం ఎంతో ప్రత్యేకమైనదని, కొత్త టెక్నాలజీలను అందిపుచ్చుకోవడంలో తమకు తిరుగులేదని నిరూపించిందన్నారు. ‘డిజిటల్‌ చెల్లింపుల వ్యవస్థ (యూపీఐ) శరవేగంగా విస్తరించడం దీనికి మచ్చుతునక. గూగుల్‌ పే వంటి పేమెంట్‌ ప్లాట్‌ఫామ్‌లు అంచనాలను మించి విజయం సాధించాయి. కొన్నేళ్ల క్రితం యూపీఐ ప్రజల దైనందిన జీవితాల్లో ఇలా చొచ్చుకుపోతుందని ఎవరైనా ఊహించారా. ఇప్పుడు దేశంలో ఇదో అద్భుతమైన డిజిటల్‌ విప్లవంగా మారింది. వందల కోట్ల లావాదేవీలతో యూపీఐ ప్రజల వినియోగం, కొనుగోళ్ల తీరునే సమూలంగా మార్చేసింది’ అని ప్రీతి పేర్కొన్నారు.  

భారత్‌ కీలక మార్కెట్‌...
గూగుల్‌కు భారత్‌ అత్యంత కీలక మార్కెట్‌గా కొనసాగుతోందని.. సమీప భవిష్యత్తులోనే ట్రిలియన్‌ (లక్ష కోట్లు) డాలర్లకు చేరే దిశగా దేశ డిజిటల్‌ ఎకానమీ పరుగులు తీస్తోందని ప్రీతి పేర్కొన్నారు. అడ్వర్టయిజింగ్, క్లౌడ్‌ టెక్నాలజీ, అధునాతన ఏఐ రంగాల్లో గూగుల్‌కు ఉన్న పట్టు, నైపుణ్యాలను భారత్‌ ఆర్థిక వృద్ధికి తోడ్పాటు అందించేందుకు ఉపయోగిస్తామన్నారు.

దేశ ఆర్థిక పురోగతికి ముఖ్యంగా డిజిటల్‌ రంగంలో గూగుల్‌ ఇతోధికంగా సహకారం అందిస్తున్న ‘ఈ కీలకమైన, ఉత్తేజకరమైన తరుణం’లో కంపెనీ ఇండియా హెడ్‌గా కొత్త బాధ్యతలను చేపట్టడం చాలా ఉత్సాహాన్నిస్తోందని ఆమె అభిప్రాయపడ్డారు. గూగుల్‌ ప్రపంచవ్యాప్త వ్యూహంలో భారత్‌ మార్కెట్‌ కీలక పాత్ర పోషిస్తుందనడానికి యూట్యూబ్‌ షార్ట్స్, జీపే తొలుత ఇక్కడే ప్రారంభించడం నిదర్శనమని కూడా గుర్తుచేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement