
కృత్రిమమేధకు ఆదరణ పెరుగుతున్న కొద్దీ సాఫ్ట్వేర్ ఉద్యోగుల్లో గుబులు అధికమవుతోంది. తమ ఉద్యోగాల స్థానంలో ఏఐ పాగా వేస్తుందని చాలామంది జంకుతున్నారు. ఇదే అదనుగా కొన్ని కంపెనీలు కాస్ట్ కటింగ్, పునర్వ్యవస్థీకరణ పేరుతో ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రకటిస్తున్నాయి. సాఫ్ట్వేర్ డెవలపర్ల స్థానాన్ని ఏఐ భర్తీ చేస్తుందని చెబుతూ కొన్ని కంపెనీల వ్యవస్థాపకులు, సీఈఓలు తమ మోడళ్ల అమ్మకాలను పెంచుకోవడానికి ఎక్కువగా ప్రచారం చేస్తున్నట్లు ఏఐ కోడింగ్ ప్లాట్ఫామ్ విండ్సర్ఫ్ వ్యవస్థాపక బృందం సభ్యుడు అన్షుల్ రామచంద్రన్ తెలిపారు.
‘ఏఐ ప్రభావం పెరుగుతోందని చెబుతున్నవారిలో చాలా మంది ఎలాగైనా కొందరు ఉద్యోగులను తొలగించాలని కోరుకుంటున్నారు. అందుకు ఏఐను సాకుగా వాడుతున్నారు. ఇలాంటి వ్యక్తుల్లో కొందరు సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్ కోసం ప్రత్యేకంగా ఏఐ నమూనాలను రూపొందిస్తున్నారు. మరిన్ని మోడళ్లను విక్రయించడానికి ఇది వ్యాపార వ్యూహంగా పని చేస్తుంది. డెవలపర్ అడాప్షన్, ఎంటర్ప్రైజ్ పార్ట్నర్షిప్ పరంగా అమెరికా తర్వాత భారత్ రెండో అతిపెద్ద మార్కెట్గా అవతరిస్తోంది. భారత్లో 1.7 కోట్ల మంది డెవలపర్లు ఉన్నారు’ అని చెప్పారు.
ఇదీ చదవండి: హోర్ముజ్ జలసంధి మూసివేత..?
‘వాస్తవంగా కృత్రిమ మేధను అందిపుచ్చుకోవడానికి భారత్కు సరిపడా శక్తి ఉంది. భారత్లో జీపీయూ క్లస్టర్లను నిర్మించడంపై చురుగ్గా ముందుకెళ్తున్నాం. ఇప్పటికే భారత్లోని ప్రముఖ ఐటీ కంపెనీలతో వివిధ స్థాయిల్లో కలిసి పనిచేస్తున్నాం. ఇండియన్ ఐటీ కంపెనీలు తమ అంతర్జాతీయ సహచరుల కంటే వేగంగా కృత్రిమ మేధను ఉపయోగిస్తున్నాయి. అయితే ఈ కంపెనీలు ఇప్పటికే టెక్నాలజీని వివిధ విభాగాల్లో వైవిధ్యపరిచాయి’ అని రామచంద్రన్ తెలిపారు.