
సులభంగా పనులు చక్కబెట్టేస్తుంది
విభిన్న రంగాల్లో పెరుగుతున్న వినియోగం..
స్మార్ట్ టెక్నాలజీతో మారుతున్న వీటి పనితీరు
హ్యూమనాయిడ్స్ తయారీలోకి దిగ్గజ సంస్థలు..
ఈ రంగంలో కొత్త ఆశలు రేపుతున్న భారత్
‘మనసున మనసై.. బ్రతుకున బ్రతుకై...’ – తోడొకరు ఉండటానికేముంది కానీ.. ఇంట్లో వంట పనికి తోడుండగలరా? ఇల్లు తుడవటానికి తోడుండగలరా? గిన్నెలు తోమటానికి, బట్టల్ని నీళ్లలో జాడించటానికీ, దండెం మీద ఆరేయటానికీ తోడుండగలరా? అది కదా నిజంగా తోడుగా ఉండటం అంటే! ఒక్క ఇల్లనే కాదు; ఇంటి పనీ, వంట పనీ అనే కాదు – చేదోడు అవసరమైన ప్రతి చోటా, ప్రతి రంగంలో మనసెరిగి పనులు చక్కబెట్టే మనిషొకరు ఉంటే ప్రపంచం ఎంత సౌఖ్యంగా మారిపోతుంది! నిజమే కానీ, మానవ మాత్రులెవ్వరూ అలా తోడుగా ఉండలేరు. అందుకొక మెషీన్ కావలసిందే. వట్టి మెషీన్ కాదు.. మనిషి లాంటి మెషీన్.. అంటే.. హ్యూమనాయిడ్!!
మొన్న మే 21న..
టెస్లా కంపెనీ అధినేత ఎలాన్ మస్క్ ‘కనీ విని ఎరుగని’అంటూ ఒక వీడియో క్లిప్ విడుదల చేశారు. అందులో ‘ఆప్టిమస్’అనే హ్యూమనాయిడ్ ఇంటి పనుల్ని చలాకీగా చక్కబెట్టేస్తోంది. వంగి, చెత్త బ్యాగును తీసి డస్ట్ బిన్లో పడేస్తోంది. ఒక చేత్తో బ్రష్, ఇంకో చేత్తో డస్ట్ ప్యాన్ ఉపయోగించి టేబుల్ని శుభ్రం చేస్తోంది. టిష్యూ పేపర్ రోల్ నుంచి చిన్న ముక్కను లాగి తీసుకుంటోంది. స్టౌ మీద గిన్నెలో కూరగాయల్ని గరిటెతో కలియదిప్పుతోంది. గచ్చును తుడుస్తోంది. ప్రశాంతంగా సూచనలు పాటిస్తూ.. ‘ఇంకేమైనా పనుందా అమ్మగారూ...’అనే మన పాతకాలపు పనిమనిషిలా తర్వాతి ఆదేశాల కోసం చూస్తోంది. త్వరలోనే మార్కెట్లోకి రానున్న ఈ ‘ఆప్టిమస్’హ్యూమనాయిడ్ రూ.18–25 లక్షల వరకు ఉంటుందట.
హ్యూమనాయిడ్, రోబో ఒకటి కాదా..
ఈ ప్రశ్నకు సమాధానం... ‘కాదు’, ‘అవును’కూడా. హ్యూమనాయిడ్లన్నీ రోబోలే. కానీ, రోబోలన్నీ హ్యూమనాయిడ్లు కావు. రోబో యంత్రమైతే, హ్యూమనాయిడ్ మానవ యంత్రం. రోబో ఏ ఆకారంలోనైనా ఉండొచ్చు. హ్యూమనాయిడ్ మాత్రం కృత్రిమ మేధస్సుతో ప్రత్యేక మానవ నైపుణ్యాలను, మానవాకృతిని కలిగి ఉంటుంది. ఫ్యాక్టరీలో కారు భాగాలు జోడించే సాధారణ రోబోలు, లేదా నేలను శుభ్రం చేసే వాక్యూమ్ క్లీనర్ రోబోలతో పోలిస్తే ఈ హ్యూమనాయిడ్లు చాలా వైవిధ్యమైనవి. ఇవి కష్టమైన పనులను సైతం చేయగలవు, మనుషులతో మాట్లాడగలవు, కొత్త పరిస్థితులకు అలవాటు పడగలవు. వీటి ప్రత్యేకత ఏమిటంటే.. వీటి రూపం మనుషులకు సౌకర్యంగా అనిపించడం.
ఇంత తెలివి ఎలా ?
హ్యూమనాయిడ్లు మనుషుల్లా పనిచేయడానికి స్మార్ట్ టెక్నాలజీలను ఉపయోగించుకుంటాయి. ఏఐ మస్తిష్కంతో ఇవి ప్రపంచాన్ని అర్థం చేసుకుంటాయి. వాటిల్లోని సెన్సార్లే.. వాటి పంచేంద్రియాలు. గదిని 3డీలో చూడటానికి, వస్తువులను గుర్తించడానికి 3డీ కెమెరాలు, ‘లైడార్’ సహాయపడతాయి. గైరోస్కోప్లు, యాక్సిలరోమీటర్లు వీటి నడకను బ్యాలెన్స్ చేస్తాయి. ‘ఫోర్స్’సెన్సార్లు వస్తువులను అవి పగలనంత సున్నితంగా పట్టుకోవడానికి తోడ్పడ తాయి.
విజన్ సెన్సార్లు ముఖాలను గుర్తించడానికి, దారులను కనుక్కోటానికి ఉపకరిస్తాయి. హ్యూమనాయిడ్లు మైక్రోఫోన్లతో మాటలను విని, అర్థం చేసుకోగలవు. మోటార్లు, యాక్చుయేటర్లు వాటి కండరాలు. శక్తిమంతమైన కంప్యూటర్ల సెన్సార్ల నుండి వచ్చే సమాచారాన్ని వేగంగా ప్రాసెస్ చేస్తాయి. అందువల్ల హ్యూమనాయిడ్లు తక్షణం ఆలోచించి పనిచేయగలదు. బ్యాటరీలతో ఇవి 5 గంటల వరకు పనిచేస్తాయి. కానీ నడిచే హ్యూమనాయిడ్లకు చాలా శక్తి అవసరం. వీటిని ఇంటర్నెట్తో అనుసంధానిస్తారు.
‘అక్యూట్’తో భారత్ అరంగేట్రం!
హ్యూమనాయిడ్స్ను మనదేశమూ తయారు చేస్తోంది. తొలిసారిగా బిట్స్ పిలానీ ‘అక్యూట్’అనే హ్యూమనాయిడ్ కి ప్రాణ ప్రతిష్ట చేసింది. ఇస్రో, డీఆర్డీఓ, రిలయన్స్ వంటివి ఈ రంగంలో విస్తృత ప్రయత్నాలు చేస్తున్నాయి. కృత్రిమ మేధ (ఏఐ), సెన్సార్ల వంటి స్మార్ట్ టెక్నాలజీలు ఈ హ్యూమనాయిడ్ల మెదడుకు మేత. ఈ మేతకు అవసరమైన కీలక ఎలక్ట్రానిక్ విడిభాగాల కోసం చైనా, యూఎస్, జర్మనీలపై ఆధారపడకుండా పూర్తి స్థాయిలో తయారీ చేపడితే అంతర్జాతీయంగా హ్యూమనాయిడ్ రోబోల రంగంలో భారత్ పోటీపడే అవకాశాలు ఉంటాయని మార్కెట్ వర్గాలు అంటున్నాయి.
వచ్చే ఐదేళ్లలో 50 వేలు...
ప్రపంచ హ్యూమనాయిడ్ రోబో మార్కెట్ 2024లో 3.28 బిలియన్ డాలర్లు. 2032 నాటికి ఇది 66 బిలియన్ డాలర్లకు చేరవచ్చని నివేదికలు చెబుతున్నాయి. భారత హ్యూమనాయిడ్ రోబోల మార్కెట్ విలువ రూ.1,275 కోట్లు. మొత్తం 8,000 రోబోలలో హ్యూమనాయిడ్లు 10 శాతం వరకు ఉంటాయి. ఏటా 25 శాతం రోబోలు తోడవుతున్నాయి. 2030 నాటికి భారత్ 50,000 హ్యూమనాయిడ్లను ఉపయోగించే అవకాశం ఉంది. మన హ్యూమనాయిడ్ రోబోల మార్కెట్ 2035 నాటికి రూ.12,750 కోట్లకు చేరొచ్చని అంచనా.
సవాళ్లు – పరిమితులు
హ్యూమనాయిడ్ రోబోల తయారీ, వినియోగం ఖరీదైన వ్యవహారం. చైనాకు చెందిన ‘యూనిట్రీ జీ1’ధర రూ.13.6 లక్షలు. భారత రోబోలు.. ఆప్టిమస్ లేదా యూనిట్రీ జీ1 లాగా స్వేచ్ఛగా కదలలేవు, బ్యాటరీ ఎక్కువసేపు ఉండదు. రోబోలకు 5జీ వంటి వేగవంతమైన ఇంటర్నెట్ కావాలి. భారత్లో పూర్తి స్థాయిలో 5జీ విస్తృతం కాలేదు. అయితే మన ‘యాడ్వర్బ్’భారీ ప్రణాళికలు, డీఆర్డీఓ రక్షణ పనులు.. భారత్ సైతం ఈ రంగంలో పోటీపడగలదని నిరూపిస్తున్నాయి. ఖర్చు వంటి సవాళ్లు ఉన్నప్పటికీ ఆశాజనకంగా ఉన్న మార్కెట్, ప్రభుత్వ మద్దతు ఉజ్వల భవిష్యత్తుపై ఆశలు కలిగిస్తున్నాయి.
పోటీలో దూసుకుపోతున్న భారత్
⇒ హ్యూమనాయిడ్ రోబో రేసులో దేశీయ కంపెనీలు చురుగ్గా ఉన్నాయి. మెక్స్ రోబోటిక్స్, స్వాయ రోబోటిక్స్, ఇన్వెంటో రోబోటిక్స్, సిరెనా టెక్నాలజీస్, విస్టాన్నెక్ట్స్జెన్ తదితర సంస్థలు వీటి తయారీలో ఉన్నాయి.
⇒ షాపులు, ఫ్యాక్టరీలు, కస్టమర్ సేవల కోసం అహ్మదాబాద్కు చెందిన కోడీ టెక్నోలాబ్ తయారు చేసిన ‘స్కంద’2024లో రంగ ప్రవేశం చేసింది. షాపుల్లో స్టాక్ నిర్వహణ వంటి పనులు చేస్తుంది.
⇒ రిలయన్స్ ఇండస్ట్రీస్ పెట్టుబడులు పెట్టిన నోయిడాకు చెందిన యాడ్వర్బ్ టెక్నాలజీస్ ఫ్యాషన్, రిటైల్, ఎనర్జీ రంగాల్లో వాడేందుకు హ్యూమనాయిడ్ను తీసుకొస్తోంది. ఉత్పత్తులను అసెంబుల్ చేయడం, గిడ్డంగుల్లో వస్తువులను తీసుకెళ్లడం వంటి క్లిష్టమైన పనులు ఇది చేస్తుంది.
⇒ ప్రమాదకర మిలటరీ పనుల కోసం డీఆర్డీఓ, స్వాయ రోబోటిక్స్తో కలిసి 2027 నాటికి హ్యూమనాయిడ్ను పరిచయం చేయనుంది. ఇది 24 విధాలుగా కదలగలదు. 3డీలో ప్రాంతాలను మ్యాప్ చేయగలదు. బాంబులను నిరీ్వర్యం చేయగలదు. ప్రమాదకర ప్రాంతాల్లో సమాచారాన్ని సేకరించగలదు.
⇒ భారత్ అంతరిక్ష పరిశోధన సంస్థ అంతరిక్ష మిషన్లలో సహాయపడేందుకు వ్యోమమిత్ర హ్యూమనాయిడ్ రోబో తయారుచేసింది.
కొన్ని హ్యూమనాయిడ్లు..
⇒ చైనా కంపెనీ యూబీటెక్ వృద్ధుల సంరక్షణ, బోధన కోసం ప్రత్యేక హ్యూమనాయిడ్లను తయారు చేస్తోంది. యూఎస్ టెక్నాలజీ సంస్థ ఎజిలిటీ రోబోటిక్స్ తయారు చేసిన ‘డిజిట్’లు వస్తువులను తీసుకోవడం, ప్యాక్ చేయడంn చేస్తున్నాయి. స్టాన్ఫోర్డ్ వర్సిటీ రూపొందించిన ‘ఓషన్ వన్’... సముద్రంలో ప్రమాదకర ప్రాంతాల్లో, భూగర్భంలో వెలికితీతలకు చక్కగా ఉపయోగ పడుతోంది.