మౌలిక వ్యవస్థలపై భారీ దాడులు | Iran oil facilities hit for first time as war with US-Israel enters day 9 | Sakshi
Sakshi News home page

మౌలిక వ్యవస్థలపై భారీ దాడులు

Mar 9 2026 4:46 AM | Updated on Mar 9 2026 4:46 AM

Iran oil facilities hit for first time as war with US-Israel enters day 9

అమెరికా – ఇజ్రాయెల్‌ దాడుల్లో మంటలంటుకుని టెహ్రాన్‌లోని చమురు నిల్వ కేంద్రం వద్ద అలుముకున్న పొగ

తొమ్మిదో రోజుకు పశ్చిమాసియా యుద్ధం 

ఇరాన్‌ చమురు నిల్వ కేంద్రాలపై ఇజ్రాయెల్‌ దాడి

చమురు లీకేజీతో మంటల్లో చిక్కిన టెహ్రాన్‌ వీధులు 

ఇరాన్‌ అంతరిక్ష సంస్థ ప్రధాన కార్యాలయం ధ్వంసం 

బహ్రెయిన్‌ నీటి శుద్ధి కేంద్రంపై విరుచుకుపడిన ఇరాన్‌ 

కువైట్‌ సిటీపై డ్రోన్ల వర్షం కురిపించిన ఇరాన్‌ సైన్యం 

సౌదీ అరేబియాలో ఒక భారతీయుడి దుర్మరణం

టెహ్రాన్‌/దుబాయ్‌: పశ్చిమాసియా యుద్ధం నానాటికీ తీవ్రమవుతోంది. ఇరాన్, అమెరికా–ఇజ్రాయెల్‌ పోరాటం ఆదివారం తొమ్మిదో రోజుకు చేరింది. ఇరాక్‌ రాజధాని టెహ్రాన్‌తో పాటు అల్‌బోర్జ్‌లోని చమురు లక్ష్యాలపై ఇజ్రాయెల్‌ దాడికి దిగింది. నాలుగు చమురు నిల్వ కేంద్రాలతో పాటు ఉత్పత్తి, బదిలీ కేంద్రంపైనా వైమానిక దాడులు చేసింది. ఈ ఘటనలో నలుగురు ట్యాంకర్‌ డ్రైవర్లు మరణించారు. టెహ్రాన్‌ వీధుల్లో చమురు ఏరులై ప్రవహించింది. చమురుకు మంటలంటుకొని అగి్నధారలను తలపించాయి. యాజ్డ్, టెహ్రాన్, ఇస్పహాన్‌ నగరాలపైనా ఇజ్రాయెల్‌ విరుచుకుపడింది.

భారీగా క్షిపణులు ప్రయోగించింది. ఇస్పహాన్‌లో వర్క్‌షాపులను, హార్స్‌రైడింగ్‌ క్లబ్‌ను బాంబులు ధ్వంసం చేశాయి. ఈ దాడుల్లో 11 మంది మృతిచెందారు. ఇస్పహాన్‌ ఎయిర్‌పోర్టులో ఇరాన్‌కు చెందిన ఎఫ్‌–14 విమానాలు, గగనతల రక్షణ వ్యవస్థను తుత్తునియలు చేసినట్లు ఇజ్రాయెల్‌ సైన్యం ప్రకటించింది. టెహ్రాన్‌లో ఇరాన్‌ అంతరిక్ష సంస్థ ప్రధాన కార్యాలయాన్ని ధ్వంసం చేశామని పేర్కొంది.

ఈ కార్యాలయాన్ని ఉగ్ర కార్యకలాపాలతో పాటు ఇజ్రాయెల్‌పై నిఘా కోసం ఇస్లామిక్‌ రెవల్యూషనరీ గార్డ్‌ కార్ప్స్‌ (ఐఆర్‌జీసీ) వాడుకుంటోందని ఆరోపించింది. ఐఆర్‌జీసీ ఇంటర్నల్‌ సెక్యూరిటీ కమాండ్‌ సెంటర్, 50 ఆయుధ బంకర్లు, గ్రౌండ్‌ ఫోర్స్‌ కాంపౌండ్‌ను నామరూపాల్లేకుండా చేసినట్లు వెల్లడించింది. ఇరాన్‌ దాడుల్లో ఒక భారతీయుడు, మరొక బంగ్లావాసి మరణించినట్టు సౌదీ అరేబియా ప్రకటించింది. 12 మంది బంగ్లాదేశీలు గాయపడ్డట్టు వెల్లడించింది. 

అమెరికా రాడార్లు నేలమట్టం  
కువైట్‌పై ఇరాన్‌ భారీ దాడులకు పాల్పడింది. అల్‌–అదిరీ ఎయిర్‌బేస్‌పై మిస్సైల్, డ్రోన్‌ను ప్రయోగించింది. అమెరికా హెలికాప్టర్‌ మరమ్మతు కేంద్రాన్ని, ఇంధన ట్యాంకులను, కమాండ్‌ పోస్టు ధ్వంసం చేశామని ఐఆర్‌జీసీ ప్రకటించింది. యూఎస్‌ థాడ్‌ క్షిపణిరక్షణ వ్యవస్థకు సంబంధించిన నాలుగు రాడార్లను గత 24 గంటల్లో నేలమట్టం చేశామని వెల్లడించింది. ప్రెసిషన్‌–గైడెడ్‌ మిస్సైళ్లతో ఈ దాడికి దిగినట్లు ఇరాన్‌ ప్రభుత్వ వార్తా సంస్థ పేర్కొంది.

 బహ్రెయిన్‌లోని నీటి శుద్ధి కేంద్రంపైనా ఇరాన్‌ సైన్యం దాడికి దిగింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగిన దృశ్యాలు మీడియాలో ప్రసారమయ్యాయి. ఈ యుద్ధంలో పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోవడం ఇదే మొదటిసారి. తొలుత అమెరికా–ఇజ్రాయెల్‌ సైన్యమే తమ డిశాలినేషన్‌ ప్లాంట్‌పై వైమానిక దాడులకు పాల్పడిందని ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాగ్చీ ఆరోపించారు. ఎడారి ప్రాంతమైన గల్ఫ్‌లో తాగునీటికి డిశాలినేషన్‌ ప్లాంట్లే ప్రాణాధారం.    

స్వదేశానికి 32 వేల మంది అమెరికన్లు 
యుద్ధం నేపథ్యంలో పశ్చిమాసియాలో∙నివసిస్తున్న అమెరికన్లు స్వదేశానికి పయనమవుతున్నారు. యుద్ధం మొదలైన తర్వాత ఇప్పటికే 32,000 మందికిపైగా పౌరులు అమెరికాకు చేరుకున్నారు. వారిలో చాలామంది సొంత ఖర్చుతోనే వచ్చారని అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది. మిగతావారి కోసం ప్రత్యేకంగా విమానాలు సమకూర్చినట్లు పేర్కొంది. పశ్చిమాసియా దేశాల్లో ఉన్న అమెరికన్లు సాధ్యమైనంత త్వరగా ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని ఆరాటపడుతున్నారు.  

మంటల్లో కువైట్‌ విమానాశ్రయం, ప్రభుత్వ భవనాలు
ఇరాన్‌ సైన్యం కువైట్‌ సిటీపై డ్రోన్ల వర్షం కురిపించింది. ఈ దాడిలో బహుళ అంతస్థుల భవనం మంటల్లో చిక్కుకుంది. కువైట్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులోని ఇంధన ట్యాంకులకు మంటలు అంటుకున్నాయి. నగరమంతా సైరన్ల మోత వినిపించింది. ఇరాన్‌ ప్రయోగించిన పలు క్షిపణులను కువైట్‌ ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థ నేలకూలి్చంది. కానీ, ఆకాశం నుంచి వేగంగా దూసుకొచి్చన శకలాల వల్ల మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి.

ఇరాన్‌ దాడుల్లో ఇద్దరు కువైట్‌ బోర్డర్‌ సెక్యూరిటీ జవాన్లు మృతిచెందారు. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(యూఏఈ)పైనా ఇరాన్‌ విరుచుకుపడింది. ఇరాన్‌ సైన్యం 16 బాలిస్టిక్‌ క్షిపణులు, 117 డ్రోన్లు ప్రయోగించినట్లు యూఏఈ పేర్కొంది. తోటి ఇస్లామిక్‌ దేశాలకు ఇరాన్‌ అధ్యక్షుడు మసూద్‌ పెజెష్కియాన్‌ సరికొత్త హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్‌పై దాడులకు ఆయా దేశాల భూభాగాలను ఉపయోగించుకోవడానికి అనుమతి ఇస్తే ధీటుగా బదులిస్తామని, తమ ప్రతిస్పందన తీవ్రస్థాయిలో ఉంటుందని స్పష్టంచేశారు.  

Advertisement
 
Advertisement
Advertisement