శుద్ధ యురేనియం నిల్వల్ని ఎత్తుకొచ్చేయాలని ప్రణాళిక
కుదరకపోతే అణుకేంద్రాన్ని నాశనం చేయాలని యోచన
వాషింగ్టన్: ఇరాన్ దగ్గరున్న శుద్ధి చేసిన యురేనియం నిల్వలను అక్కడినుంచి ఎలాగైనా తరలించాలని అమెరికా భావిస్తోంది. అక్కడి అణుకేంద్రాలపై అమెరికా వాయుసేన కన్నేసింది. అందుకోసం సర్జికల్ స్ట్రైక్ తరహాలో ఇజ్రాయెల్ సాయంతో భూతల దాడులకు దిగాలని ట్రంప్ సర్కారు యోచిస్తోంది. ఎన్బీసీ న్యూస్ వార్తాసంస్థ ఈ మేరకు ఒక కథనంలో పేర్కొంది. అణు కేంద్రాలపై భారీ స్థాయిలో బాంబులు వేసే బదులు ప్రత్యేక సైనిక బృందాన్ని రహస్యంగా తరలించి యురేనియం నిల్వలను ఎత్తుకొచ్చే అవకాశాలను ట్రంప్ సర్కార్ పరిశీలిస్తోందని రిపబ్లికన్ పార్టీ సీనియర్ నేతలు ఆదివారం వెల్లడించారు. ఇటీవల అమెరికా ఉభయ చట్టసభల సభ్యులకు యుద్ధ వివరాలను నివేదిస్తూ విదేశాంగ మంత్రి మార్కో రూబియో పరోక్షంగా ఈ మేరకు వెల్లడించారు.
‘కొందరు వెళ్లి అక్కడున్న వాటిని పట్టుకొస్తారు’ అని అన్నారు. యురేనియం నిల్వలకు సంబంధించి అమెరికా రెండు ప్రణాళికలను సిద్ధంచేసుకుంది. నిల్వలను జాగ్రత్తగా ఎత్తుకొచ్చేయడం. లేదంటే శుద్ద యురేనియంను ఇతర మలినాలతో కలిపేసి దాని గాఢత తగ్గించి పరీక్షలకు శాశ్వతంగా పనికి రాకుండా చేయడం. అయితే యురేనియాన్ని నిరుపయోగం చేయడం సాధారణ సైనికుల వల్ల కాదు.
కనుక అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (ఐఏఈఏ)లోని అణు శాస్త్రవేత్తలు, సహాయక సిబ్బందిని కూడా సైనికులతో పాటు ఇరాన్ భూగర్భ అణుకేంద్రాల దగ్గరికి తీసుకెళ్లి వారితో పని పూర్తి చేయించాలని ట్రంప్ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధంచేస్తోందని తెలుస్తోంది. అమెరికా సైనికులను ఇరాన్ గడ్డ మీదకు పంపుతారా అని ట్రంప్ను మీడియా ప్రశ్నించగా ‘‘వాళ్లను భూతల దాడులకు పంపించే యోచన లేదు. వాళ్లు వెళ్తేనే పని అవుతుందన్న సందర్భంలో మాత్రమే రంగంలోకి దింపుతా. లేదంటే వాయుసేన, డ్రోన్లతోనే ఇరాన్ కథ ముగిస్తా’’ అని బదులిచ్చారు.


