రష్యా చమురు కొనుగోలుకు యూఎస్‌ ఓకే | US Waiver Eases India Oil Imports Amid Iran Israel Tensions | Sakshi
Sakshi News home page

రష్యా చమురు కొనుగోలుకు యూఎస్‌ ఓకే

Mar 6 2026 1:14 PM | Updated on Mar 6 2026 1:21 PM

US Waiver Eases India Oil Imports Amid Iran Israel Tensions

అంతర్జాతీయ ఇంధన మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి, ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారతదేశానికి అమెరికా నుంచి ఊరట లభించింది. రష్యన్ ముడి చమురును సేకరించడానికి భారతీయ రిఫైనరీలకు అమెరికా ట్రెజరీ విభాగం 30 రోజుల పాటు తాత్కాలిక మినహాయింపు మంజూరు చేసింది.

గతంలో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభ సమయంలో భారత్ తక్కువ ధరకే రష్యా చమురును పొందింది. ఫిబ్రవరి 28 నాటి గణాంకాల ప్రకారం, హెచ్‌పీసీఎల్ వంటి ప్రభుత్వ సంస్థలు బ్యారెల్‌కు 13 డాలర్ల భారీ తగ్గింపుతో చమురును కొనుగోలు చేశాయి. కానీ ప్రస్తుత పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. మార్చి, ఏప్రిల్ ప్రారంభంలో భారత నౌకాశ్రయాలకు చేరబోయే రష్యన్‌ చమురుపై వ్యాపారులు ఇప్పుడు బ్రెంటు క్రూడ్ ధర కంటే బ్యారెల్‌కు 4 నుంచి 5 డాలర్ల ప్రీమియం వసూలు చేస్తున్నారు. మిడిల్‌ఈస్ట్‌ ప్రాంతంలో సరఫరా వ్యవస్థ దెబ్బతినడం వల్ల రష్యా చమురుకు డిమాండ్ విపరీతంగా పెరగడమే దీనికి ప్రధాన కారణం.

యుద్ధ సంక్షోభం.. భారత్ వ్యూహం

భారతదేశం తన చమురు అవసరాల్లో దాదాపు 40 శాతం మిడిల్‌ ఈస్ట్‌ నుంచి దిగుమతి చేసుకుంటోంది. ఇందులో ప్రధానంగా హార్ముజ్ జలసంధి ద్వారానే సరఫరా అవుతోంది. ఇరాన్ వివాదం కారణంగా ఈ సరఫరాకు ఆటంకం కలిగే ప్రమాదం ఉండటంతో భారత రిఫైనర్లు రష్యా వైపు మొగ్గు చూపుతున్నారు. ‘ప్రస్తుతం మార్కెట్లో ధర కంటే కూడా చమురు లభ్యత అత్యంత కీలకంగా మారింది. ఇంధన భద్రత దృష్ట్యా భారత రిఫైనర్లు తిరిగి రష్యా మార్కెట్లోకి ప్రవేశించాయి’ అని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ఇప్పటికే ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం , హిందుస్థాన్ పెట్రోలియం, ఎంఆర్‌పీఎల్‌ సంస్థలు సుమారు 20 మిలియన్ బ్యారెళ్ల రష్యా చమురును కొనుగోలు చేయడానికి చర్చలు జరుపుతున్నట్లు రాయిటర్స్ నివేదించింది.

అమెరికా మినహాయింపు ఎందుకు?

ప్రపంచ చమురు ధరల నియంత్రణను దృష్టిలో ఉంచుకొని భారత్ వంటి భారీ వినియోగదారు రష్యా చమురును ఒక్కసారిగా నిలిపివేస్తే గ్లోబల్ మార్కెట్‌లో డిమాండ్ పెరిగి ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 100 డాలర్లు దాటే ప్రమాదం ఉంది. ఇది అమెరికాలో కూడా ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది. ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల వల్ల హార్ముజ్ జలసంధి ద్వారా సరఫరా ఆగిపోతే ప్రత్యామ్నాయంగా రష్యా చమురు అందుబాటులో ఉండటం ప్రపంచ ఇంధన భద్రతకు అవసరం.

యూఎస్‌ను సంప్రదించకుండా నేరుగా కొనుగోలు చేస్తే..

ఒకవేళ భారత్ అమెరికా ఆంక్షలను ధిక్కరించి రష్యాతో నేరుగా లావాదేవీలు జరిపితే ఎలాంటి పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉందో చూద్దాం.

  • అంతర్జాతీయ వాణిజ్యం ఎక్కువగా డాలర్లలో జరుగుతుంది. అమెరికా అనుమతి లేకపోతే రష్యాకు డబ్బు చెల్లించే భారతీయ బ్యాంకులపై అమెరికా ఆంక్షలు విధిస్తుంది. దీనివల్ల ఆ బ్యాంకులు ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంతోనూ లావాదేవీలు జరపలేవు (స్విఫ్ట్‌ వ్యవస్థ నుంచి తొలగించడం వంటివి).

  • చమురు మోసుకొచ్చే నౌకలకు అంతర్జాతీయంగా బీమా అందించే సంస్థలు ఎక్కువగా పాశ్చాత్య దేశాలవే. అమెరికా ఆగ్రహిస్తే రష్యా చమురు తెచ్చే నౌకలకు బీమా లభించదు. ఏదైనా ప్రమాదం జరిగితే అది భారీ నష్టానికి దారితీస్తుంది.

  • రష్యాతో వ్యాపారం చేసే భారతీయ కంపెనీలను అమెరికా తన బ్లాక్ లిస్ట్‌లో పెడుతుంది. దీనివల్ల ఆ కంపెనీలు అమెరికాలో వ్యాపారం చేయలేవు, అమెరికా సాంకేతికతను పొందలేవు. ఉదాహరణకు, రిలయన్స్ లేదా నయారా వంటి సంస్థలు తమ ఎగుమతుల విషయంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

  • క్వాడ్ (QUAD) వంటి కూటముల్లో భారత్ ప్రాధాన్యత తగ్గే అవకాశం ఉంది. రక్షణ రంగంలో అమెరికా నుంచి అందుతున్న కీలక సాంకేతికత (డ్రోన్లు, జెట్ ఇంజిన్లు) నిలిచిపోయే ప్రమాదం ఉంటుంది.

భారత్ ప్రస్తుతం వ్యూహాత్మక విధానాన్ని అనుసరిస్తోంది. అంటే రష్యాతో స్నేహాన్ని కాపాడుకుంటూనే అమెరికా ఆంక్షల పరిధి దాటకుండా జాగ్రత్త పడుతోంది. అందుకే నేరుగా ఘర్షణకు వెళ్లకుండా ఇలాంటి మినహాయింపుల ద్వారా తన అవసరాలను తీర్చుకుంటోంది.

ఇదీ చదవండి: కక్కలేక.. మింగలేక..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement