పశ్చిమాసియాలో యుద్ధంతో (#IranIsraelUSWar) హర్ముజ్ జలసంధిలో నౌకల రాకపోకలు వారానికి పైగా నిల్చిపోతే దేశీయంగా పలు రంగాలపై తీవ్ర ప్రభావం పడుతుందని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీషియేటివ్ (జీటీఆర్ఐ) ఒక నివేదికలో వెల్లడించింది. ఇంధన మార్కెట్ల నుంచి ఎరువుల సరఫరా, పరిశ్రమలకు ముడిపదార్థాలు, నిర్మాణ రంగ మెటీరియల్స్తో పాటు ఇతరత్రా ఎగుమతి రంగాలకు కూడా సవాళ్లు తప్పవని పేర్కొంది.
‘‘దీనితో తక్షణం పెట్రోలియంపై ప్రభావం పడుతుంది. 2025లో పశ్చిమాసియా నుంచి భారత్ 70 బిలియన్ డాలర్ల విలువ చేసే పెట్రోలియం క్రూడ్, ఇతర ఉత్పత్తులను దిగుమతి చేసుకుంది. ప్రస్తుతం భారత్ వద్ద 30 రోజులకు సరిపడేంత ఇంధన నిల్వలే ఉన్నాయి. ఒకవేళ షిప్మెంట్స్లో ప్రతిష్టంభన మరింత దీర్ఘకాలం కొనసాగితే ఇంధనాల ధరలు వేగంగా పెరిగిపోతాయి. దీంతో రవాణా వ్యయాలతో పాటు మిగతా అన్నింటి ధరలూ పెరుగుతాయి. డీజిల్ రేట్ల వల్ల రైతులకు ఇరిగేషన్ పంపులు, ట్రాక్టర్ల నిర్వహణ వ్యయాల భారం పెరుగుతుంది’’ అని జీటీఆర్ఐ ఫౌండర్ అజయ్ శ్రీవాస్తవ తెలిపారు.


